రాష్ట్రంలో వలంటీర్లు కేంద్రంగా జరుగుతున్న రాజకీయంలో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. వలం టీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేశారంటూ.. వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా ఆ పార్టీ నాయకులు.. పదే పదే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వలంటీర్ వ్యవస్థను సైతం తీసేసేం దుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారనేది వీరి వాదనగా ఉంది. అయితే.. ఇక్కడే కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం వస్తున్న విమర్శల దాడిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని పదే పదే చెబుతున్న చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్లకు మరింత మెరుగైన వేతనం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి.. వలంటీర్లు ఒక్కొక్కరికీ నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాయించుకునేలా చర్యలుత ఈసుకుంటామని కూడా.. చంద్రబాబు ఇటీవల నిర్వహిస్తున్న ప్రజా గళం సభల్లో చెబుతున్నారు.
పైకి ఇది ఎఫెక్ట్ చూపించడం లేదని కొందరు అంటున్నా.. వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే.. వలంటీర్లకు రక్షణ కల్పిస్తామని.. తొలి సంతకం దీనిపైనే ఉంటుందని ఆ పార్టీ చెబుతున్నా.. వలంటీర్లలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇవి స్పష్టంగా కనిపిస్తున్నా యి. విజయవాడ, తిరుపతి, గుంటూరు జిల్లాలకు చెందిన వందల మంది వలంటీర్లు.. తాజాగా రెండు రోజుల నుంచి ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.
ఈ క్రమంలో తమ దారి విషయంపై వారు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఎన్నికల్లో వలం టీర్లను తమ పదవులకు రాజీనామాలు చేసి వైసీపీ తరఫున ప్రచారం చేయాలన్న ఒత్తిడి అధికార పార్టీ నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటివారు.. ఇప్పుడు.. చంద్రబాబు ప్రకటనలతో ముగ్దులవుతు న్నారు. టీడీపీకి మద్దతు తెలపాలని విజయవాడకు చెందిన సుమారు 120 మంది వలంటీర్లు నిర్ణయించడం.. ఆసక్తిగా మారింది.
వైసీపీ అధికారంలోకి వచ్చినా.. తమకు అందేది రూ.5 వేలేనని.. చంద్రబాబు వస్తే.. కనీసం తమ జీవితాలైనా మారుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వలంటీర్లు ఎటువైపు అనేచర్చ జోరుగా సాగుతోంది. మున్ముందు దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.