Amalapuram Violence: కోనసీమ జిల్లా అమలాపురంలో ఇటీవల జరిగిన విధ్వంసకర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్న ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని ఆ ప్రాంత యువకులు, ఉద్యోగులు, వ్యాపారుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సమస్యపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా స్పందించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Amalapuram Violence: నాలుగు మండలాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ
ముందుగా ఐ పోలవరం, సఖినేపల్లి, మలికిపురం, అత్రేయపురం మండలాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఎస్పీ సుబ్బారెడ్డి లేఖ రాయగా, ఈ లేఖను జిల్లా అధికారులు హోంశాఖ కార్యదర్శికి పంపారు. మిగిలిన కోనసీమ మండలాల్లో ఆంక్షలు కొనసాగనున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లో ఇంటర్నెట్ సేవల రద్దును మరో 24 గంటల పాటు పొడిగించారు. మరో పక్క అమలాపురం అల్లర్లకు సంబంధించి నిందితుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంగళవారం మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసుల్లో అరెస్టు అయిన వారి సంఖ్య 71కి చేరుకుంది. మరి కొంత మంది అనుమానితులను అరెస్టు చేసే దిశగా పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అమలాపురంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాల ధ్వంసం, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిప్పు పెట్టి దగ్ధం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు.