AP Airports: ఏపిలోని ఎయిర్ పోర్టులు అన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం అమరవాతి రాజధానిగా ప్రకటన చేసిన తరువాత వివిధ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తల రాకపోకలు సాగించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. ఫలితంగా విజయవాడ సమీపంలోని గన్నవరం, విశాఖ, తిరుపతి సమీపంలోని రేణిగుంట, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులతో పాటు నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని విమానాశ్రయానికి కొత్తగా విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. కర్నూలులో కొత్తగా విమానాశ్రయం ఏర్పాటు చేశారు.
గత రెండేళ్లలో కరోనా పరిస్థితులనైతే నేమీ, మూడు రాజధానుల ప్రకటనతో అయితేనేమీ ఎయిర్ ట్రాఫిక్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ ఏపిలోని ఎయిర్ పోర్టుల పరిస్థితి గురించి వివరించారు. ఆయన తెలియజేసిన వివరాల ప్రకారం…గన్నవరం, రేణిగుంట, రాజమహేంద్రవరం, కడప ఎయిర్ పోర్టుల నష్టాలు ఏయేటి కాయేడు పెరిగిపోతున్నట్లు స్పష్టం అయ్యింది. పరిపాలనా రాజధానిగా జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రకటించిన విశాఖ ఎయిర్ పోర్టు ఒక్కటి మాత్రమే రాష్ట్రంలో పెద్దగా నష్టాలు లేకుండా నెట్టుకువస్తోంది.
గన్నవరం ఎయిర్ పోర్టు 2018 -19 ఏడాదిలో 41.7 కోట్ల నష్టాలలో ఉండగా, 2019-20 ఏడాదిలో రూ.60.22, 2020 -21 ఏడాదికి రూ.63.95 కోట్ల నష్టాలకు చేరింది. ఇక రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు విషయానికి వస్తే 2018 -19లో 32.84 కోట్ల నష్టాల్లో ఉండగా, 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 45.27 కోట్లుకు చేరాయి. ఇక 2020 – 21 ఏడాదికి ఆ నష్టాలు కాస్త తగ్గి రూ.44,19 కోట్లకు చేరింది. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఎయిర్ పోర్టు కూడా నష్టాల బాటలోనే కొనసాగుతోంది. 2018-19లో రూ.9.81 కోట్లు ఉండగా 2019-20 లో రూ.10.51 కోట్లకు చేరాయి. 2021-21లో ఈ నష్టాలు కాస్తంత తగ్గి రూ.8.93 కోట్లకు తగ్గింది. ఇక రేణిగుంట ఎయిర్ పోర్టు పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు.