AP Cinema Ticket rates: ఏపిలో సినిమా టికెట్ల ధరలు, ఇతర సమస్యలపై ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో సహా ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, ఆలీ, ఆర్ నారాయణమూర్తి తదితర సినీ రంగ ప్రముఖులు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు చెప్పిన విషయాలపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ నెలాఖరు కల్లా గుడ్ న్యూస్ తో జీవో వస్తుందని, వివాదం సద్దుమణిగినట్లే అని అందరూ అనుకున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పలు మార్లు భేటీ అయింది. టికెట్ల ధరలపై ఓ రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే టికెట్ల ధరల నిర్ణయం జరగకపోవడానికి అసలు కారణం ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మాటల్లో వెల్లడైంది.
AP Cinema Ticket rates: సీఎం జగన్ తో పోసాని కృష్ణమురళి భేటీ
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని శుక్రవారం పోసాని కృష్ణమురళి భేటీ అయ్యారు. హైదరాబాద్ నుండి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన కృష్ణమురళి.. సీఎం జగన్ ను కలిశారు. అనంతరం పోసాని మీడియాతో మాట్లాడుతూ ఈ భేటీ వ్యక్తిగతమైనదనీ, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నారు. తన కుటుంబం కరోనాతో బాధపడుతున్న సమయంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతి మాట సాయం చేశారనీ, ఏఐజీ ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అందుకే సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని వెల్లడించారు. ఈ సందర్భంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు తన దైన శైలిలో పోసాని సమాధానాలు ఇచ్చారు.
చిన్న సినిమాల నుండి ప్రతిపాదనలు అందాకే
సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. చిన్న సినిమాల నుండి ప్రతిపాదనలు అందాకే టికెట్ల ధరలపై నిర్ణయం వస్తుందన్నారు. అయితే ఈ భేటీలో సీఎంతో సినిమా టికెట్ల ధరలపై తాను చర్చించలేదని చెప్పారు. ఆలీకి ఇస్తున్నట్లే తనకు పదవి ఇస్తున్నారు అనడంలో వాస్తవం లేదని తెలిపారు. భీమ్లానాయక్ సినిమా టికెట్ల గురించి తనకు తెలియదనీ, తాను సినిమా వాడినే గానీ దాని గురించి తనకు తెలియదని పోసాని పేర్కొన్నారు. పోసాని మాట్లాడిన దాని బట్టి చూస్తే చిన్న సినిమాల నుండి ఇంకా ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చినట్లు లేదు. ఇదిలా ఉంటే.. మంత్రి గౌతమ్ రెడ్డి మరణం బాధలో తాము ఉన్నామనీీ, అందువల్లనే టికెట్ ధరలకు సంబంధించి జీవో ఆలస్యం అయ్యిందని ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.