AP CM YS Jagan: తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నాడుట ఓ పెద్ద మనిషి. ఈ సామెత మీరు తెలుసు కదా. ఇప్పుడు అదే తీరుగా ఏపిలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఉందని ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. ఏపిలో
ఉద్యోగులు పిఆర్సీ తదితర సమస్యలపై పోరాడుతుంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని పాలకులు వివరిస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం ఉద్యోగులు, పెన్షన్ల జీత భత్యాలకే సరిపోతోందంటూ మాటలు చెబుతున్నారు. వారు చెప్పేది బాగానే ఉంది.
AP CM YS Jagan: జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు అవసరమా..?
ఇంత ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పుడు జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు అవసరమా..? అవశ్యకత ఉందా..? అనే విషయాలను పరిశీలించాలి కదా. సీఎం జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుండి విమర్శలు రావడమే కాక అధికార పార్టీకి చెందిన కొందరు నేతలే చాటుగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారుట. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి, కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలులో విమానాశ్రయాలు నిర్వహణలో ఉన్నాయి. దాదాపుగా అన్ని విమానాశ్రయాలు నష్టాల బాటనే నడుస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
తిరుపతి ఎయిర్ పోర్టుయే 35 కోట్ల నష్టాల్లో
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే ఏకైక విమానాశ్రయం తిరుపతి (రేణిగుంట). ఈ విమానాశ్రయం కూడా దాదాపు 35 కోట్ల నష్టాల్లో ఉంది. ఈ కారణంగా కేంద్రం తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు విషయానికి వస్తే సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఎయిర్ పోర్టుల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా..? ఆలోచించాల్సిన అవసరం లేదా..? రాష్ట్ర ప్రభుత్వానికి రెండు డజన్లకు మించి సలహాదారులు ఉన్నారు, వందలాది మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీరు ప్రభుత్వానికి ఏమి సూచనలు చేస్తున్నట్లు.
AP CM YS Jagan: తెలంగాణ రాష్ట్రం ఆరు అడిగితే మూడింటికే గ్రీన్ సిగ్నల్
అసలు జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు అంటే కేంద్రం అనుమతి ఇస్తుందా..? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదా..? తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి అనుమతి కోరితే కేంద్రం మూడింటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై భారత విమానయాన సంస్థ తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభ నష్టాలను అంచనా వేసి మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే అన్ని రకాల తగిన విధంగా ఉన్నాయని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఏపి ప్రభుత్వం జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ప్రతిపాదనలు పంపినా కేంద్రం అన్నింటికీ అనుమతులు ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు అవసరమా..? సాధ్యమా..? అని సాక్షి ఛానల్ లో పని చేసే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ సైతం తన వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం గమనార్హం.