ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రైతాంగానికి సూచించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా నేడు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందుల లో ఏపికార్ల్ వద్ద న్యూటక్ బయోసైన్సెస్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ రోజుల్లో పకృతి వ్యవసాయమే శ్రేయస్కరమని అన్నారు. ఇందు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు ప్రోత్సహం అందిస్తుందని చెప్పారు. రసాయనాలతో కూడిన ఆహారం వల్ల అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయన్నారు.
ప్రస్తుతం ఏపిలో ఆరు లక్షల మంది రైతులు పకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామస్థాయిలో శిక్షణలు ఏర్పాటు చేసి పకృతి వ్యవసాయంపై అవగాహన పెంచాలని సూచించారు. పకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోందని చెప్పారు. విత్తు నుండి విక్రయం వరకూ రైతులకు ఆర్ బీ కే లు అండగా నిలుస్తున్నాయన్నారు. అంతకు ముందు పులివెందుల, వేంపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నందు నియోజకవర్గ అభివృద్ధి పనులపై సీఎం జగన్ స్థానిక నాయకులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరి కొద్ది సేపటిలో ఇడుపులపాయిలోని వైఎస్ఆర్ ఎస్టేట్ కు సీఎం జగన్ చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయ నుండి హెలికాఫ్టర్ లో కడప ఎయిర్ పోర్టుకు కు 9.10 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుండి 9.20 గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి 10.10 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ప్లీనరీ వేదిక వద్దకు చేరుకుంటారు. రేపు, ఎల్లుండి ప్లీనరీ వద్దనే సీఎం జగన్ ఉండనున్నారు.