AP Employees PRC: పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఉద్యోగుల సమ్మె తేదీ దగ్గర పడుతుందటంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది. తొలుత మంత్రుల కమిటీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ జరిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. శుక్రవారం రాత్రి దాదాపు అయిదు గంటల పాటు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చించింది. పలు డిమాండ్ల పై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Read More: AP High Court: ఉద్యోగ సంఘాలకు షాక్ ఇచ్చేలా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
AP Employees PRC: పలు అంశాల్లో సవరణలకు ప్రభుత్వం సుముఖత
మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ, జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ లు స్టీరింగ్ కమిటీ తరపున పాల్గొన్న 20 మంది ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వ ప్రతిపాదనలు వివరించారు. హెచ్ఆర్ఏ శ్లాబుల్లో మార్పులకు మంత్రులు అంగీకారం తెలిపారు. దీంతో పాటు అదనపు క్వాంటమ్ ఫించను, తదితర అంశాల్లో మార్పులు చేసేందుకు సంసిగ్ధత వ్యక్తం చేశారు.
హెచ్ఆర్ఏ నాలుగు స్లాబులు
హెచ్ఆర్ఏ నాలుగు స్లాబులు 8 శాతం, 12 శాతం, 16 శాతం, 24 శాతం ఇచ్చేందుకు మంత్రుల కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. సీపీఎస్ రద్దు పై మరో మంత్రివర్గ ఉప సంఘం చర్చిస్తోందని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపింది. మరో ఉప సంఘం చర్చలు దృష్ట్యా సమయం కావాలని కోరింది. ప్రభుత్వం సూచించిన అంశాలపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించిన తరువాత మంత్రుల కమిటీ ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. హెచ్ఆర్ఏ శ్లాబ్ లు పాతవే కొనసాగించాలనీ, 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని, ఓట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస టైమ్ స్కేల్, గ్రామ సచివాలయ సిబ్బందికి 2022 పిఆర్సీ స్కేల్ ఇవ్వాలని, మార్చి 31 లోగా సీపీఎస్ రద్దు పై నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్ర పీఆర్సీనే కొనసాగించాలని మంత్రుల కమిటీకి వెల్లడించారు.
కాగా శనివారం (నేడు) మధ్యాహ్నం 2 గంటలకు మరో సారి సమావేశం జరిపేందుకు నిర్ణయించింది మంత్రుల కమిటీ. అయితే కొన్ని అంశాలల్లో ఏకాభిప్రాయం కుదిరిందనీ, మరి కొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందనీ, చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నాయనీ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లకుండానే ప్రభుత్వం తమ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని సంఘ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.