YS Jagan: సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలుస్తుంది అని చెప్పవచ్చు. జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి నవరత్న పథకాల అమలునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదు. వివిధ పథకాల లబ్దిదారులకు బటన్ నొక్కి నేరుగా వారి ఖతాల్లో నిధులు జమ చేస్తున్నారు సీఎం జగన్. దీంతో అవినీతికి అస్కారం లేకుండా పోతుంది. లబ్దిదారులకు న్యాయం జరుగుతోంది.
అధికారం చేపట్టిన నాటి నుండి సీఎం జగన్ విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు మరింత ప్రయోజనం కలిగేలా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు సంబంధించి కీలక విషయాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజినీ వెల్లడించారు. ఇప్పటి వరకూ ఆరోగ్య శ్రీ లో లేని జబ్బులకు పేద వర్గాలు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సి వస్తుంది. అందుకే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా కొన్ని వ్యాధులను ఆరోగ్య శ్రీ జాబితాలోకి తీసుకురావడం జరిగింది.
తాజాగా ఆరోగ్య శ్రీ కార్డుపై మరి కొన్ని వ్యాధులకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని పెంచినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య శ్రీ పై వైద్య సేవల పరిమితిని రూ.25 లక్షల వరకూ పెంచారు. రూ.25 లక్షల వరకూ ఎలాంటి అపరేషన్ లు అయినా ఉచితంగా చేయించుకోవచ్చు. ఏపీలో ఆరోగ్య శ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండటానికి వీల్లేదని అన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయనున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 18న పరిమితి పెంచిన ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని మంత్రి చెప్పారు.
ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం సీ ఎం ప్రారంభించిన తర్వాత అర్హులందరికీ అందుబాటులోకి వస్తాయని మంత్రి రజిని తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నామన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయాలు డిజిటలైజ్ చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీని వల్ల గతంలో వైద్యం నిమిత్తం వచ్చిన రోగుల పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని, ఏ వైద్యుడిని సంప్రదించినా అతని అనారోగ్య పరిస్థితి పూర్తిగా తెలుసుకుని వైద్యం చేసే వీలు ఉంటుందని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ .. ఈ మూడింటికి సంబంధించిన డేటా ఒకే చోట ఉండేలా సరికొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. త్వరలోనే జగనన్న సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి రజిని వెల్లడించారు.