AP Govt: పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలపై పదేళ్ల తర్వాత పూర్తి స్థాయి హక్కులు కల్పించేలా రాష్ట్ర అసైన్మెంట్ చట్టంలో కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో న్యాయశాఖ మంగళవారం రాత్రి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆర్డినెన్స్ ఇచ్చింది.
ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన కెబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇంటి స్థలాలపై పూర్తి హక్కులు ఇచ్చే గడువును 20 ఏళ్ల నుండి పదేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఏపి అసైన్మెంట్ చట్టం (పీవోటీ) -1977 ప్రకారం డీకేటీ పట్టాల ద్వారా ఇంటి స్థలాలు కేటియిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్థలం ఇచ్చిన సంవత్సరంలోపు ఇల్లు కట్టుకోవాలన్న నిబంధనలు ఉన్నాయి. పట్టా పేదల పేరిట ఉన్నా ఆ భూమిపై 20 సంవత్సరాల పాటు ప్రభుత్వానికే పూర్తి హక్కులు ఉంటాయి. అంటే ఈ గడువులోగా లబ్దిదారులు ఇంటి స్థలాలు లేదా నిర్మించిన ఇళ్లను స్థలంతో సహా అమ్ముకోవడానికి వీలులేకుండా కఠినమైన నిబంధలు విధించారు. అయితే చిన్న చిన్న ఆర్థిక అవసరాలకు కూడా పేదలు ఈ స్థలాలను అమ్ముకుంటున్నారని, మళ్లీ సొంత ఇల్లు కోల్పోయి నష్టపోతున్నారని భావించిన ప్రభుత్వం 2019లోనే ఏపి అసైన్మెంట్ చట్టంలో సవరణలు ప్రతిపాదించి 20 ఏళ్ల గడువు విధించింది. ఇప్పుడు ఈ గడువును పదేళ్లకే కుదించాలని, అన్యాక్రాంతమైన, పరాధీనమైన, అమ్ముకున్న భూములను నిబంధనలకు లోబడి క్రమబద్దీరకరించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
పేదింటి స్థలాలపై గడువును పదేళ్లకు కుదించడం వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుంది. క్రమబద్దీకరణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఏపి అసైన్మెంట్ చట్టం ప్రకారం డీకేటీ పట్టాల ద్వారా స్థలం పొందిన ఇంటి స్థలాలను 20 సంవత్సరాల పాటు అమ్ముకోవడం, కొనుగోలు చేయడం నేరం, ఆర్డినెన్స్ ద్వారా గడువును పదేళ్లకు కుదించారు. అంటే పదేళ్ల గడువు తీరిన తరువాత పేదలకు ఆ ఇంటి స్థలంపై పూర్తి స్థాయి హక్కులు వస్తాయి. ఈ స్థలాలను వారు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల పేదలకు మేలు జరుగుతుంది. నిర్ధిష్ట గడువు తీరి పూర్తి హక్కులు పొందిన వారికి, ముందుగానే అనధికారికంగా కొనుగోలు చేసినవారికి క్రమబద్దీకరణ అప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. గడువుకు ముందే ఎవరైనా డీకేటీ పట్టాలు కొనుగోలు చేసి ఉంటే వాటిని పదేళ్ల కాలపరిమితి తీరితే ఇప్పుడు వాటిని క్రమబద్దీకరించుకోవచ్చు. ఇందు కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు.