AP Govt: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ జీతాల చెల్లింపులే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో పక్క రాష్ట్రం చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకోవాలని వైసీపీ పార్లమెంట్ సభ్యులు కోరుతున్నారు. పరిస్థితులు ఈ విధంగా ఉన్నా సీఎం జగన్ నవరత్న పథకాలను యధావిధిగా కొనసాగిస్తున్నారు. కొన్ని ఇచ్చిన హామీలను విస్మరించినా కొన్ని ఇవ్వని హామీలను నెరవేర్చారు. తాజాగా జగన్మోహనరెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
AP Govt: ప్రొబేషన్ ఖరారు
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్టాత్మంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు పని చేస్తున్నాయి. వీటిలో లక్షా 20వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏపీపీఎస్సీ పరీక్షల ద్వారా గ్రామ సచివాలయ సిబ్బంది నియామకాలు చేపట్టిన ప్రభుత్వం.. వారికి సంబంధించి ప్రొబేషన్ ఖరారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియకు ప్రభుత్వం నుండి రాగా జిల్లాల వారిగా ప్రొబేషన్ ఖరారు చేసే పని జరుగుతోంది. త్వరలోనే వీరంతా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు.
ఒక్కో ఉద్యోగికి మూడు జతల యూనిఫామ్
గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులందరికీ యూనిఫామ్ తో పాటు 4జీ సిమ్ లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి యూనిఫామ్ లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత సీఎం జగన్ వారి యూనిఫామ్ కు సంబంధించిన కలర్ ఖరారు చేశారు. ఒక్కో ఉద్యోగికి మూడు జతల యూనిఫామ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా యూనిఫామ్ ల పంపిణీకి గానూ రెండు సంస్థలకు ఆర్డర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యువకులకు ప్యాంట్, షర్ట్, మహిళా ఉద్యోగులకు పంజాబీ డ్రైస్ పంపిణీ చేయనున్నారు.