RK Roja: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పులు, చేర్పుల ప్రక్రియ చేపట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్ అని చెప్పేస్తున్నారు. కొందరిని వేరే ప్రాంతాలకు ఇన్ చార్జిలుగా నియమిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమించారు.
మొదటి లిస్ట్ లోనే నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని తెల్చి చెప్పారు. మార్పులు, చేర్పుల్లో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. ఈ తరుణంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆర్కే రోజాను పక్కన పెట్టి మరొకరికి టికెట్ కేటాయిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మంత్రి ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్ రాదనే ప్రచారంపై రోజా భగ్గుమన్నారు.
తనకు టికెట్ రాదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ సునకానందం పొందుతున్నారని రోజా ధ్వజమెత్తారు. తనకు టికెట్ ఇవ్వకపోతే రామోజీయో, రాధాకృష్ణో వచ్చి నగరిలో పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమని అన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో తాను ఎప్పుడూ ముందు వరుసలో ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రజలు అభిమానం, విశ్వాసంతో ఉన్నారనీ, మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 175కి 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీకే 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేక గోతి కాడ నక్కలా వైసీపీ నుండి ఎవరైనా గొడవ పడి వస్తారేమో ఎదురు చూస్తున్నారని విమర్శించారు. జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచే ఆయన వెంట ఉన్నామనీ, జగన్ సీఎం కావాలని పని చేసే వాళ్లమని అన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అని సర్వేలు తేలుస్తాయని, వాటి ద్వారా టికెట్ ల కేటాయింపు జరుగుతుందన్నారు. టికెట్ రాని వారికి ప్రత్యామ్నాయం ఏం చేయాలో కూడా సీఎం జగన్ ఆలోచిస్తారని రోజా తెలిపారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఒకే చోట నిలబడి గెలిచే దమ్ము లేక రాబోయే ఎన్నికల్లో రెండు రెండు చోట్ల పోటీ చేయాలని సర్వేలు చేసుకుంటున్నారని విమర్శించారు. తాను జగనన్న సైనికురాలినని, జగనన్న కోసం ప్రాణమైనా ఇస్తానని పేర్కొన్నారు. నగరి టికెట్ నాకే అన్న సంగతి పార్టీ కార్యకర్తలు, నాయకులకు తెలుసునని, అందుకే వాళ్లలో ఎలాంటి బాధ లేదన్నారు. తమ పార్టీ లో అందరు జగన్మోహనరెడ్డి తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని తెలిపారు రోజా.
PM Modi: ఇండియా కూటమిపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు