వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు, విద్యార్ధులు, ప్రజా సంఘాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆముదాలవలసలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొని ప్రసంగించారు. పాలనా వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని జేఏసి ప్రతినిధులు అన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యా వైద్య రంగాల్లో ఎనలేని పురోగతి ఉంటుందని చెప్పారు. విశాఖను రాజధాని చేస్తే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయని వక్తలు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొన్నారు. పిల్లల రేపటి భవిష్యత్తు కోసమే ఉత్తరాంధ్ర ప్రజల ఈ పోరాటమని అన్నారు. అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదని నిపుణులు ఎంత చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని తమ్మినేని విమర్శించారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఏపి హైకోర్టులో ఇరుపక్షాలకు చుక్కెదురు
నరసన్నపేటలో విశాఖ రాజధాని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్, జేఏసి కన్వీనర్ లజపతిరాయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ ర్యాలీలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఎన్టీఓలు పాల్గొన్నారు. విశాఖ రాజధాని కోసం ప్రతి పల్లె నినదించాలని లజపతిరాయ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో విద్యార్ధులు కీలక పాత్ర పోషించాలని విజ్ఞఫ్తి చేశారు. వలసల నివారణ, ఉపాధి అవకాశాలు విశాఖ రాజధానితోనే సాధ్యమవుతాయని వారు పేర్కొన్నారు.