రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ భారీ ఎత్తున పందేలు కూడా సాగుతుంటాయి. అనేక సందర్భాల్లో ఇక్కడ పెద్ద ఎత్తున దాడులు కూడా జరిగాయి. అయినప్పటికీ.. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఇక్కడ బెట్టింగులు ఖాయం . ఎక్కడ క్రికెట్ జరిగినా.. ఇక్కడ కోట్లు కదలడం ఖాయం. సో.. ఇప్పుడు కూడా ఏపీ ఎన్నికల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. మొత్తంగా 5 నియోజకవర్గాలపై తెలంగాణలో బెట్టింగులు కట్టినట్టు సమాచారం.
హైదరాబాద్, నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ బెట్టింగులపై పోలీసులు కూడా నిఘా పెట్టారని సమాచారం. నిజానికి తెలంగాణలో కూడా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. ఏపీలో ఉన్నంత హాట్ టాపిక్అక్కడి ఎన్నికలపై మాత్రం లేకపోవడం గమనార్హం. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై బెట్టింగులు కట్టారు. వీరితోపాటు.. నారా లోకేష్ పైగా బెట్టింగులు సాగుతున్నాయి. అలాగే.. టీడీపీ సీనియర్ నేత.. గంటా శ్రీనివాసరావుపైనా బెట్టింగులు సాగుతున్నాయి. అలాగే షర్మిల పైనా పందేలు కట్టారు.
చంద్రబాబు: కుప్పంలో ఈ సారిఆయనను ఓడిస్తామని.. వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. దీంతో ఆయన గెలుపుపై జోరుగా పందేలు కడుతున్నారు. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు.. తిరుపతిలోనూ సాగుతోంది.
జగన్: వైనాట్ పులివెందుల నినాదంతో టీడీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. అయితే.. ఆయన గెలుపు కంటే కూడా.. మెజారిటీపైనే ఎక్కువగా పందేలు కడుతున్నారు. గత ఎన్నికల కంటే ఎక్కువగా మెజారిటీ వస్తుందని ఒకరు.. రాదని మరొక వర్గం పందేలు కడుతోంది.
పవన్: పిఠాపురంలో హాట్గా ఉన్న పవన్ ప్రచారంపైనా ఎక్కువగా బెట్టింగులు కడుతున్నారు. ఆయన గెలుస్తారని కొందరు.. లేదని ఎక్కువ మంది చేతులు కలిపారు.
నారా లోకేష్: మంగళగిరిలో మరోసారి పోటీ చేస్తున్న నారా లోకేష్ గెలుపుపై ఎక్కువ మంది పందెం కడితే.. ఓడిపోతారని.. అంతే స్థాయలో మరికొందరు కట్టారు.
గంటా : ఈయన భీమిలిలో ఈ దఫా ఓటమి ఖాయమని ఎక్కువ మంది పందెం కట్టడం విశేషం.
షర్మిల: కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల చిత్తుగా ఓడిపోతారని.. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు పందెం కట్టడం చర్చగామారింది. అయితే.. ఈయన కు ఒకే ఒక్కరు పోటీలో ఉన్నారు. ఆయన మాత్రం బలమైన గెలు పు ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.