Big Breaking: ఏపి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.120 కోట్ల జరిమానా విధించింది. అలాగే పురుషోత్తంపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టినందుకు కూడా జరిమానా వేసింది ఎన్టీటీ. పురషోత్తంపట్నంకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. జనవరి 3వ తేదీలోపు జరిమానా చెల్లించాలని ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంత కుమార్ తో పాటు మరి కొందరు ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. దాదాపు నాలుగైదు సంవత్సరాలుగా ఎన్జీటీలో కేసు విచారణ జరుగుతుంది.
పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నప్పటికీ ఆ అనుమతులు ఉల్లంఘిస్తున్నారని పర్యావరణ వేత్తలు ఎన్జీటీకి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై ఎన్జీటీ పలు కమిటీలను వేసింది. ఈ కమిటీల నివేదికల ఆధారంగా నేడు తుది తీర్పు ఇచ్చింది ఎన్జీటీ. ఇక పోలవరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన పురుషోత్తంపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అసలు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పర్యావరణ వేత్తలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇవి పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాలు అని కావున వీటికి ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీసీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీని నియమించాలని ట్రైబ్యునల్ పేర్కొంది.