AP Special Status : తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా ఏపి, తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఈ సామెతకు అద్దం పడుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపికి ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా అనేక హామీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. విభజన హామీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలుపడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రత్యేక హోదా సాధించకపోగా కేంద్రంలోని ఎన్ డీ ఏతో తెగతెంపులు చేసుకున్న తరువాత ప్రత్యేక హోదా అంటూ ఆందోళనలు, నిరసనలు చేపట్టింది. కాగా ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అంటూ బీజేపీ నేతలు చాలా సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. అయినా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర పెద్దలకు వినతి పత్రాలను సమర్పిస్తూనే ఉన్నారు.
అయితే తాజాగా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపికి ప్రత్యేక హోదాపై టీడీపీ సభ్యుడు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టమైన జవాబు ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఏపికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి వాటి పరిష్కారం తమ చేతుల్లో ఏమిలేదని తేల్చి చెప్పారు. ఆ సమస్యలు తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సూచించారు.