Chandrababu: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కొద్ది సేపటి క్రితం ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. పదవిలో ఉన్న నేత చనిపోయిన కారణంగా జరిగే ఉప ఎన్నికల్లో మృతుడి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తొందని చెప్పారు చంద్రబాబు. ఈ సంప్రదాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని మరో సారి స్పష్టం చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Chandrababu: గత సంప్రదాయాన్ని అనుసరించే..
ఈ సంప్రదాయాన్ని గౌరవించి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయరాదని నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు. చనిపోయిన నేత కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో టీడీపీ ఏనాడూ పోటీ చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ చేయలేదో అదే కారణంతోనే ఆత్మకూరులోనూ పోటీ చేయడం లేదని చంద్రబాబు చెప్పారు. ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయని విమర్శించారు.
Chandrababu: విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు
కాగా వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. నిన్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా విక్రమ్ రెడ్డి బీ ఫారం అందుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎన్నికల బరిలో లేకపోయినప్పటికీ బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ అభ్యర్ధి విక్రమ్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతుంది. ఈ నెల 23న పోలింగ్, 26న కౌంటింగ్ జరగనుంది.