Breaking: పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీక్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి నారాయణ బెయిల్ ను రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా తొమ్మిదో అదనపు కోర్టు ఇవేళ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీలోపు కోర్టులో హజరుకాావాలని కోర్టు ఆదేశించింది. విషయంలోకి వెళితే.. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల నిర్వహణ సమయంలో పలు చోట్ల ప్రశ్నా పత్రాలు లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రశ్నాపత్రాల లీక్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నారాయణ విద్యాసంస్థల్లో పని చేసే ఓ ఉపాధ్యాయుడే లీక్ చేసినట్లుగా కనుగొన్నారు. పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేసిన తర్వాత వారిని విచారించిన అనంతరం నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హజరుపర్చారు.
అయితే నారాయణ తరపు న్యాయవాదులు ఆయన ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థ బాధ్యతలు చూడటం లేదని కోర్టుకు తెలియజేస్తూ అందుకు సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే నారాయణకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ చిత్తూరు ఒన్ టౌన్ పోలీసులు కోర్టులో సవాల్ చేశారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన కోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది. నవంబర్ 30వ తేదీలోగా కోర్టులో హజరుపర్చాలని ఆదేశించింది.