YSRCP: ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు ఇంకా 18 నెలలు ఉన్నప్పటికీ ఇప్పటి నుండే సిద్దంగా కావాలంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాడర్ కు సూచిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాలపై సమీక్ష లు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు విధిగా ప్రజల్లో తిరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రీసెంట్ గా బీసీ నేతల ఆత్మీయ సమావేశాన్ని వైసీపీ నిర్వహించింది. బీసీల సంక్షేమం, అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కృషి, బీసీ నేతలకు పార్టీలో, ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తదితర విషయాలపై నేతలు మాట్లాడటంతో పాటు ఈ విషయాలను బీసీ వర్గాల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తాజాగా ఈ రోజు రాజమండ్రిలో మంజీరా కన్వెన్షన్ హాలు నందు వైసీపీ ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్, దాడిశేట్టి రాజా, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి పేర్ని నాని, పలువురు కాపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. వైసీపీలో 27 మంది కాపు ఎమ్మెల్యేలు ఉండగా, రెడ్డి సామాజిక వర్గంతో సమానంగా మంత్రి పదవులు ఇచ్చారనీ, కాపులకు వైసీపీలో అత్యంత ప్రాధాన్యతను సీఎం జగన్ ఇస్తున్నారనీ, కాపుల సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నారని నేతలు ఉన్నారు.
గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలపడుతున్నదని, టీడీపీ, జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్న తరుణంలో రాజమండ్రిలో వైసీపీ కాపు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కాపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై కొందరు వైసీపీ నేతలే కౌంటర్ అటాక్ చేశారనీ, కొందరు తీవ్రంగా స్పందించకపోవడంపై పార్టీ అధినేత, సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ను ధీటుగా ఎదుర్కొనేేందుకు, కాపు సామాజిక వర్గ ఓటర్లను జనసేన వైపు మళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని వార్తలు వినబడుతున్నాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారని సమాచారం.