CM YS Jagan: ప్రభుత్వాలకు మంచిపేరు గానీ చెడుపేరు గానీ రావడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులే కారణం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సక్రమంగా అధికారులు అమలు చేస్తే ఆ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది. అయితే ఒక్కో సారి అధికారులు చేసే తప్పిదాలు, అనాలోచిత నిర్ణయాల కారణంగా వచ్చే ఫలితం (చెడు) ప్రభుత్వంపై పడుతుంది. పాలకుల మనసు ఎరిగి పని చేసి మంచి మార్కులు కొట్టేయాలన్న ఆలోచనతో కొందరు ఉన్నతాధికారులు తీసుకునే పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతుంటాయి. చాలా విషయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్థాయి వరకూ వెళ్లకుండానే సీనియర్ ఐఏఎస్ లెవల్ లోనే నిర్ణయాలు జరుగుతుంటాయి. కొన్ని విషయాల్లో భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు, విమర్శలు తెలిసి కూడా ఐఏఎస్ లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే ఇవి హైకోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వస్తుంటాయి. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత అనేక కీలక నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. గతంలో గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో వేసిన రంగులు తొలగించి మళ్లీ రంగులు వేయాల్సి వచ్చింది. దీని వల్ల మొదట వేసిన రంగుల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.
CM YS Jagan: రంగుల అంశంపై హైకోర్టుకు ప్రమాణ పత్రం
ఆ తరువాత అయినా అధికారులు అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి కదా. కానీ వారిలో మార్పు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు వేస్తున్నారు. దీనిపై జై భీమ్ జస్టిస్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరగ్గా పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. గత విచారణ సందర్భంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో నేడు ప్రభుత్వం దీనిపై ప్రమాణ పత్రం దాఖలు చేసింది. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు వేసిన పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయబోమంటూ ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్లాప్ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. అయితే ఆ వాహనాలకు పార్టీ రంగులు వేయడంపై బీజేపీ నేతలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. వాస్తవానికైతే వాహనాలకు, కేంద్రాలకు ఏ రంగులు వేయాలి అనే దానిపై నిర్ణయం సీఎం వరకూ వెళ్లదు. ఆయా శాఖలోని సీనియర్ ఐఏఎస్ అధికారులే వీటిపై నిర్ణయాలను తీసుకుంటుంటారు. అలానే ఇప్పుడు తాజాగా విద్యాశాఖలో తీసుకున్న ఓ కీలక నిర్ణయం కూడా వివాదాస్పదం అవుతోంది.
పదవ తరగతి తెలుగు వాచకంలో అమరావతి పాఠం గల్లంతు
అది ఏమిటంటే..పదవ తరగతి తెలుగు వాచకంలో అమరావతి పాఠాన్ని విద్యాశాఖ తొలగించింది. నూతనంగా విద్యాశాఖ ముద్రించిన పుస్తకాల్లో అమరావతి పాఠ్యాంశం కనిపించలేదు. 2014 లో 12 పాఠాలతో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాన్ని ముద్రించారు. సంస్కృతిక వైభవం కింద రెండో పాఠ్యాంశంగా అమరావతిని చేర్చారు. అయితే తాజాగా పాఠశాల విద్యాశాఖ అమరావతి పాఠంను తొలగించి 11 పాఠాలతోనే ముద్రించింది. విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు సూచించారు.
విద్యాశాఖ చర్యలను తప్పుబడుతున్న నేతలు
అమరవాతిలో రాజధానిని కొనసాగించడం ఇష్టంలేకనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాజధానిని విశాఖకు తరలించడానికి మూడు రాజధానుల ప్రకటన చేశారనేది అందరికీ తెలిసిందే. పదవ తరగతి తెలుగు పుస్తకంలో అమరావతి పాఠం తొలగింపు అంశం ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు. సీఎం మనసు ఎరిగి పని చేయాలనుకునే విద్యాశాఖ అధికారుల అత్యుత్సాహం అయి ఉండవచ్చు. ఆ పాఠం ఉన్నా ప్రభుత్వానికి, విద్యార్థులకు, ప్రజలకు వచ్చే నష్టం లేదు. కానీ అధికారులు అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల కారణంగా ప్రతిపక్షాల నుండి ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పదవ తరగతి తెలుగు పుస్తకంలో అమరావతి పాఠంను తొలగించడంపై సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తో సహా పలువురు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.