Covid Vaccination: సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా వివిధ వర్గాల అభ్యున్నతి కోసం నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూ లబ్దిదారుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు సీఎం వైఎస్ జగన్.
రాజకీయంగా ప్రతిపక్షాల నుండి అనేక రకాలుగా విమర్శలు వస్తున్నా అవి ఏమీ పట్టించుకోకుండా సంక్షేమ రథాన్ని పరుగెత్తిస్తున్నారు వైఎస్ జగన్. మరో పక్క కరోనా నియంత్రణ చర్యలో భాగంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పుతోంది. గతంలో ఒకే రోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించి దేశంలోనే నంబర్ ఒన్ గా ఉన్న ఏపి సర్కార్ నేడు తన రికార్డును తానే అధిగమించి వ్యాక్సినేషన్ ప్రక్రియలో రికార్డులను తిరగరాసింది.
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ప్రభుత్వం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను ఓ ఉద్యమంగా నిర్వహించింది. ఎనిమిది లక్షల మందికి టీకాలు అందించాలన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసిన జగన్ సర్కార్ ఆ లక్ష్యాన్ని అధిగమించింది. 13 జిల్లాలలో ఏర్పాటు చేసిన 2232 కేంద్రాల ద్వారా నిర్దేశించిన లక్ష్యానికి మించి 13,59,300 మందికి వ్యాక్సిన్ వేసి తాము గతంలో వేసిన 6 లక్షల రికార్డుని తిరిగరాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేక ఆదేశాలు, అధికార యంత్రాంగం ముందస్తు చర్యలతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో జాతీయ స్థాయిలోనే రికార్డు సృష్టించింది. ఇతర రాష్ట్రాల్లో ఒక రోజులో కేవలం మూడు లక్షల మేర వ్యాక్సిన్ వేస్తుండగా ఏపిలో దానికి నాలుగు రెట్లకు పైగా టీకా పంపిణీ చేయడం విశేషం.