ఎన్డీఏ మిత్ర పక్షాల కూటమి సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి.. ఇవేళ ఎన్డీఏలో ఎలా చేరుతున్నాడో చెప్పాలని నిలదీశారు నారాయణ. పవన్ కళ్యాణ్ తీరు బాధాకరమనీ, ఈ తీరు సరికాదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను ఒక దళారీగా అభివర్ణించారు. టీడీపీ –బీజేపీ మద్య అనుబంధం కోసం ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఈ మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదని అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో ఎలా అంటకాగుతారని పవన్ ను నారాయణ నిలదీశారు. బీజేపీతో పవన్ కలవడం లౌకికవాదానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. నిన్నటి వరకూ చేగువేరా దుస్తులు వేసుకుని.. ఇప్పుడు సావర్కర్ దుస్తులు వేసుకునేందుకు సిద్దమయ్యాడనీ, రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు సిద్దమవుతాడని ఎద్దేవా చేశారు. పవన్ కు అసలు నిలకడ లేదని, కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడితే ఆ తర్వాత పవన్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చని అన్నారు నారాయణ. ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ చాలా బలమైన పార్టీగా ఉందన్నారు నారాయణ. పవన్ కళ్యాణ్ తన సిద్దాంతాలను గాలికి వదిలివేసి ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుటుంన్నారని ప్రశ్నించారు.
బీజేపీతో పొత్తు లేకుండా జనసేన – టీడీపీ ముందుకు సాగితే సీపీఐ కూడా జత కట్టేందుకు సిద్దంగా ఉంది. ఒంటరిగా పోటీ చేస్తే రాష్ట్రంలో సీపీఐ మళ్లీ బోణీ కొట్టే పరిస్థితి లేదు. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఒకటి రెండు స్థానాలు గెలుపు ఖాయమనీ, శాసనసభలో అడుగు పెట్టవచ్చన్న ఆశతో సీపీఐ ఉంది. ఈ పార్టీలు బీజేపీతో కలిసిపోటీ చేస్తే వీరి ఆశలు అడియాసలు అవుతాయి. అందుకే టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ దగ్గర కాకూడదని వామపక్షాలు భావిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో వామపక్షాలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి.
Pawan Kalyan: ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు