Crime News: విజయవాడ మధురానగర్కు చెందిన రమాదేవి అమాయకులను మోసం చేసి డబ్బులు గుంజడంతో పీహెచ్డీ చేసినట్లు ఉంది. రమాదేవితో పాటు ఆమె కుమారుడు, కుమార్తె పైనా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు మైలవరం పరిధిలోని స్టేషన్లలోనూ కేసులు నమోదు అయి ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దండుకోవడంతో పాటు వారికి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ లు ఇవ్వడం, రియల్ ఎస్టేట్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేయడం ఆమె వృత్తిగా మారింది. పోలీసులు పలు మార్లు హెచ్చరికలు జారీ చేసినా మోసాల పర్వం ఆమె కొనసాగిస్తూనే ఉంది. కొంత కాలంగా పరారీలో ఉన్న రమాదేవి, ఆమె కుమారుడు, కుమార్తెను విజయవాడ కమిషనరేట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read more: Etela Rajender: బీజేపీలో చేరిక అంశంపై ఈటెల క్లారిటీ ఇది..!!
2017లో మే నెలలో ఓ మహిళను కొట్టి బెదిరించిన కేసులో సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చింది. ఆ కేసు విచారణలోనే ఉంది. 2019లో మైలవరం పట్టణానికి చెందిన ఓ మహిళ నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట రూ.28లక్షలు తీసుకుని మోసం చేసింది. ఆ బాధితురాలి ఫిర్యాదు మేరకు మైలవరం పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 420 (చీటింగ్) కింద కేసు నమోదు చేశారు. 2020లో పెనమలూరుకు చెందిన ఓ నిరుద్యోగికి ఏకంగా హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.24 లక్షలు తీసుకుని నకిలీ అపాయిట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. బాధితుడి ఫిర్యాదుపై పెనమలూరు పోలీసు స్టేషన్ లో 2020 డిసెంబర్ నెలలో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఏ నిందితురాలిగా ఉన్న ఆమెను 2021 జనవరి 11న పెనమలూరు పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకువచ్చి విజయవాడ కోర్టులో హజరుపర్చారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ రిటర్న్ చేయడంతో ఆమె స్టేషన్ బెయిల్ పై విడుదల అయ్యింది.
ఆ తరువాత ఆమెతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కానూరుకు చెందిన ఓ మహిళను మోసం చేసింది. ఆమె కుమారుడు, కుమార్తెకు హైకోర్టు, నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మంచి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి రూ.19.90 లక్షలు తీసుకున్నది. అనంతరం వారు మోసపోయామని తెలుసుకుని పెనమలూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెకు పోలీసులు పలు మార్లు హెచ్చరించినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ ఏడాది మార్చి 23న సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పెనమలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినప్పటి నుండి రమాదేవి పరారీలో ఉంది. విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్ ఆమెను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆమె హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం తెలియడంతో పోలీసులు వెళ్లి ఆమెతో సహా ఆమె కుమారుడు, కుమార్తెను అదుపులోకి తీసుకుని వచ్చి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.