Cyclone Michaung: మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-100 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందని ముందుగా అంచనా వేసినప్పటికీ అది దిశ మార్చుకుని బాపట్ల సమీపంలో తీరం దాటింది. రాగల రెండు గంటల్లో తీవ్ర తుఫాన్ తుఫానుగా బలహీనపడనుంది. అనంతరం ఆరు గంటల్లో వాయుగుండంగా మారుతుందని అధికారులు వెల్లడించారు. తుఫాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ సూచించింది.
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీరప్రాంత జిల్లాల్లోభారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేసిన మిచౌంగ్ తుఫాను బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. ఇప్పటికే వర్షాలు, ఈదురు గాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లోనూ తుఫాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, అరటి పంటలు దెబ్బతిన్నాయి.
తుఫాను తీరం దాటినప్పటికీ అర్ధరాత్రి వరకు ఈదురు గాలులు, వర్షాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే వరి, వాణిజ్య, ఉద్యానవన పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెల కూలాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి భారీ వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
Congress: ఈ జిల్లాకు జాక్ పాట్ .. ఏకంగా మూడు కీలక పదవులు..?