ఏపిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. తెలంగాణతో పాటుగా ఏపిలో ఎన్నికలు వచ్చేలా సీఎం జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఒక సారి సీఎం వైఎస్ జగన్, రెండు మూడు పర్యాయాలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టి పారేశారు. షెడ్యుల్ ప్రకారమే ఏపిలో ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర నాయకులు కూడా చాలా రోజులుగా ముందస్తు ఎన్నికలు వస్తాయని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ కొనసాగితే వైసీపీ అధికారానికి ఢోకాలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడితే అధిాకార వైసీపీకి గట్టి పోటీ అవుతుందని నివేదికలు వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతిపక్షాలు అందుకు సిద్దం అవ్వకముందే ఎన్నికల్లోకి వెళితే వైసీపీ విజయానికి ఢోకాలేదనేది ఆ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న టాక్.
మూడు రాజధానుల అజెండాతోనే ముందుకు..?
గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల బహిరంగ సభల్లో దుష్ట చతుష్టయం అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చామని చెబుతున్నారు. గత ప్రభుత్వ పాలనను, ప్రస్తుత మన ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకుని, అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ఆదేశిస్తున్నారు.మరో పక్క ప్రతి నియోజకవర్గం నుండి ముఖ్య కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలు ఏడాదిన్నర తరువాత అన్నట్లుగా కాకుండా ఇప్పటి నుండే రేపే ఎన్నికలు అన్నట్లుగా పని చేయాలని చెబుతున్నారు. మరో పక్క పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులలో పలు మార్పులు చేశారు. దీంతో సీఎం జగన్ మనసులో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరో పక్క మూడు రాజధానుల సెంటిమెంట్ రగిలిచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానులకు సంబంధించి బిల్లు తీసుకువచ్చి మూడు ప్రాంతాల అభివృద్ధే ఏజెండాగా వైసీపీ వ్యూహాత్మ అడుగులు వేస్తుందని అంటున్నారు.
మంత్రి సిదిరి అప్పలరాజు ముందుగానే చెప్పేశారా..?
ఈ వాదనలకు బలం చేకూరేలా మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపిలో ముందస్తు ఎన్నికలు వస్తాయి అన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, సంసిద్దంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలకు సూచించారు మంత్రి సిదిరి అప్పలరాజు. మంగళవారం నాడు పలాసలో నూతన క్యాంప్ కార్యాలయాన్ని మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసుతో కలిసి ప్రారంభించిన మంత్రి అప్పలరాజు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేసిన మంత్రి అప్పలరాజు .. తమ ప్రభుత్వంపై జనంలో పీసరంత కూడా వ్యతిరేకత లేదని అన్నారు. రాష్ట్రంలో షెడ్యుల్ ప్రకారం 2024 లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, క్యాడర్ సిద్దంగా ఉండాలి అని సాక్షాత్తు జగన్మోహనరెడ్డి కేబినెట్ లోని మంత్రి అప్పలరాజు కామెంట్స్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తొంది.
ఏపి సర్కార్ కీలక నిర్ణయం .. ఇక వారికి ఆ విధులు అప్పగించరు