Gannavaram: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రీసెంట్ గా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించిన కేసిడీసీ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఇవేళ హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇటీవల యార్లగడ్డ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలోనే చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నానని, గన్నవరం అభ్యర్ధిత్వం ఖరారు చేస్తే టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ధీటైన అభ్యర్ధి టీడీపీలో లేకపోవడంతో యార్లగడ్డ చేరికను స్వాగతిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో కొనసాగుతుండగా, 22 వతేదీ గన్నవరంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ తరుణంలోనే యార్లగడ్డ వెంకట్రావు ఇవేళ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గన్నవరం లో జరిగే బహిరంగ సభలోనే యార్లగడ్డ వెంకట్రావు లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తొంది. అయితే యార్లగడ్డ తో పాటు వైసీపీ నుండి ఎవరెవరు టీడీపీలో చేరతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యార్లగడ్డ టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో విజయవాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ నుండి పలువురు నేతలను వైసీపీలో చేర్చుకుని కౌంటర్ ఇవ్వాలన్న రీతిలో ఆ పార్టీ ఉంది.
యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో గన్నవరం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ పై కేవలం 990 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీకి దగ్గర కావడంతో నియోజకవర్గంలో వంశీ వర్సెస్ యార్లగడ్డ గా మారింది. ఆ నేపథ్యంలో తొలుత యార్లగడ్డ కు కేడీసీసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు సీఎం జగన్. అయితే పలు జిల్లాల సహకార బ్యాంక్ చైర్మన్ ల పదవీ కాలం పూర్తి అయినా మరో సారి ఎక్స్ టెన్షన్ ఇచ్చి తనకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకపోవడంతో యార్లగడ్డ అసంతృప్తికి గురి అయ్యారు. దానికి తోడు నియోజకవర్గంలో వంశీ పెత్తనం కొనసాగుతుండటంతో తన వర్గీయులకు అన్యాయం జరుగుతుండటంతో ఏమి చేయలేని పరిస్థితిలో కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్నారు. నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు.
మరో పది నెలల్లో ఎన్నికలు రానుండటంతో యార్లగడ్డ యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేస్తానని చెప్పారు. సన్నిహితులతో మంతనాలు, ఆత్మీయ సమావేశాల్లో వారి అభిప్రాయాలను తీసుకుని పార్టీ వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే కొందరు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేయాలని సూచించగా, మరి కొందరు ప్రతిపక్ష టీడీపీలో చేరాలని సూచించారు. మెజార్టీ సన్నిహితుల అభిప్రాయం మేరకు టీడీపీలో చేరేందుకు యార్లగడ్డ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ఇప్పటి వరకూ గన్నవరం నియోజకవర్గంలో వంశీ కి వ్యతిరేకంగా యార్లగడ్డకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన సీనియర్ నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఈ పరిణామాల క్రమంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. దుట్టా వైసీపీలోనే కొనసాగుతారా లేక యార్లగడ్డ కు మద్దతు తెలియజేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.