ఏపీ అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ పెరిగిందా? గత వారం రోజుల్లోనే వైసీపీ గ్రాఫ్ అమాంతంగా విజృంభించి.. 10 పాయింట్లు దూసుకుపోయిందా? అంటే..ఔననే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. విపక్షాలేనని చెబుతున్నారు. మంచికి అనుకున్నారో..చెడుకు అనుకున్నారో.. అసలు ఏమీ జరగదని లెక్కలు వేసుకున్నారో తెలియదు కానీ.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు..చేసిన కొన్ని కొన్ని పనులు.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వైసీపీకి కలిసి వచ్చాయనేది పరిశీలకులు చెబుతున్న మాట.
పింఛన్ల పంపిణీ విషయంలో వలంటీర్లను జోక్యం చేసుకోకుండా చూడాలంటూ.. మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్బాబు.. నేతృత్వంలోని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచారు. ఇది విపక్ష కూటమికి మైనస్ అయిందనేది పరిశీలకుల మాట. దీనిని సమర్ధించుకునేందుకు లేదా.. ఈ సెగ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు పలు ప్రయత్నాలు చేశారు. ఇది వర్కవుట్ కాలేదు.
కానీ, క్షేత్రస్థాయిలో తమకు పింఛన్లు సక్రమంగా అందకపోవడం కంటే కూడా.. కొండలు, గుట్టలు దాటి.. ఇళ్ల నుంచి బయటకు వచ్చి కార్యాలయాల ముందు గంటల తరబడి వేచి చూసేలా చంద్రబాబు చేశారంటూ.. పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇది విపక్షాలకు మైనస్గా మారింది. ఇదే సమయంలో జగన్ ఉండబట్టే.. తమకు ఇంటికి పింఛను వస్తోందని వారు చెబుతున్నారు. దీంతో వైసీపీ గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు.
ఇక, బీజేపీ అధ్యక్షురాలు, కూటమి పార్టీ నాయకురాలు.. పురందేశ్వరి నేరుగా.. పోలీసు అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. వారి పేర్లు, ఊర్లు సహా.. వారిని మార్చి ఎవరిని నియమించాలో కూడా సూచించారు. దీంతో ఈ వ్యవహారం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నిన్న మొన్నటి వరకు వైసీపీపై వ్యతిరేకంగా ఉద్యోగులు.. ఇప్పుడు ఇలా రాజకీయ జోక్యం చేసుకుని.. తమను రాజకీయంగా బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనను వినిపిస్తున్నారు. బయటకు ఎవరూ చెప్పకపోయినా.. అంతర్గత సమావేశాల్లో వారు టీడీపీకి అయితే మద్దతు ప్రకటించలేక పోతున్నారు.
ఇక, జనసేన విషయాన్ని చూస్తే.. మరింత గాబరాగా ఉంది. పవన్ అనారోగ్యం పాలైంది నిజమే అయినా.. ఆ తర్వాత.. ఆయన హైదరాబాద్కు వెళ్లిపోవడం.. పిఠాపురంలో వైసీపీకి ప్లస్ అయింది. ఆయన అనారో గ్యం పాలయ్యారు నిజమే.కానీ, ఆయన పిఠాపురంలోనే ఏదో ఒక ఆసుపత్రిలో చేరి.. అక్కడే ఉండి ఉంటే. ఆ ఎఫెక్ట్ వేరేగా ఉండేది. కానీ, పవన్ అలా చేయలేదు. వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో రేపు పవన్ను గెలిపించినా.. ఏ చిన్న దానికైనా ఆయన హైదరాబాద్కు వెళ్లిపోతారంటూ.. యాంటీ ప్రచారం ప్రారంభమైంది. దీంతో వైసీపీనే బెటరనే వాదన ఇక్కడా వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో వైసీపీకి గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు పరిశీలకులు.
కొసమెరుపు ఏంటేంటే.. శుక్రవారం నుంచి కాంగ్రెస్ పపీసీసీ చీఫ్ షర్మిల, వివేకానందరెడ్డి కుమార్తె సునీతలు పర్యటనలు ప్రారంభించారు. దీంతో వీరి వాగ్ధాటి, విమర్శల తర్వాత.. ఏం జరుగుతుందనేది చూడాలి. ఈ గ్రాఫ్ తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది అంచనా వేయాల్సి ఉంటుంది.