Janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆయన కోలుకున్న నేపథ్యంలో మళ్లీ ప్రచార బరిలో అడుగుపెట్టనున్నారు. ఏప్రిల్ 7 నుంచి వారాహి విజయభేరి యాత్రను కొనసాగించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
పవన్ కళ్యాణ్ వారాహి విజయ భేరీ యాత్రలో భాగంగా ఈ నెల 7న అనకాపల్లిలో సభ నిర్వహిస్తారు. 8న యలమంచిలి నియోజకవర్గంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఈ నెల 9న పవన్ కళ్యాణ్ తన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. జ్వరం నుండి కోలుకున్నందున పవన్ ఈ నెల 7వ తేదీ నుండి యథావిధిగా ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇక నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.