Jagan assets case: జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఏడు చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో రెండు అభియోగపత్రాలు (చార్జిషీట్లు) కోర్టులో సమర్పించింది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈడీ ఇటీవల చార్జ్ షీట్లన కోర్టుకు సమర్పించింది. జగన్ సహా పలువురిపై అభియోగాలను పేర్కొంది. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయనీ గతంలోనే సీబీఐ తేల్చింది. వాటికి సంబంధించి అక్రమ లావాదేవీలపై ఈడీ సుదీర్ఘ దర్యాప్తు జరిపి గతంలోనే పలు ఆస్తులను అటాచ్ చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చేపట్టిన వాన్ పిక్ ప్రాజెక్టులో క్విడ్ ప్రోకో జరిగినట్లు సీబీఐ పేర్కొన్నది. వాన్ పిక్ కేసులో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన సుమారు రూ.863 కోట్ల ఆస్తులను 2016 లో ఈడీ జప్తు చేసింది. జగన్ కు చెందిన సుమారు రూ.538 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశాలపై దర్యాప్తును పూర్తి చేసిన ఈడీ ..ఇటీవల చార్జిషీట్లను సీబీఐ, ఈడీ కోర్టుకు సమర్పించింది. గతంలోనే చార్జిషీట్లను దాఖలు చేసినప్పటికీ వివిధ సాంకేతిక కారణాలతో కోర్టు వెనక్కి ఇవ్వడంతో వాటిని సరి చేసి ఇటీవల మళ్లీ సమర్పించింది. చార్జీ షీట్లపై త్వరలో కోర్టు నిర్ణయం తీసుకోనున్నది.