Jagan Strategy: వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15వ తేదీ నుండి ఓ భిన్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ పార్టీ 15వ తేదీ తరువాత బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సహా ముఖ్యమైన బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాలు మామూలుగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు కాదు. స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉంది. జగన్మోహనరెడ్డి పార్టీ పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా దానిలో పక్క వ్యూహం, రాజకీయ అజెండా దాగి ఉంటుంది.
Jagan Strategy: ఎన్టీఆర్ ఆధ్వర్యంలో బీసీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మొదటి నుండి ఆ పార్టీకి బీసీలే వెన్నెముక. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావం నుండి బీసీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 1983 లో ఎన్టీఆర్ పార్టీ టికెట్లు ఇచ్చిన వారిని చూసుకుంటే చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజరపు ఎర్రం నాయుడు. అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినా తమ్మినేని సీతారామ్ ఇలా చాలా మంది బీసీ నాయకులు టీడీపీ ద్వారా రాజకీయంగా ఎదిగారు. ఇప్పటి వరకూ రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొత్త నాయకత్వాన్ని తీసుకువచ్చింది ఎన్టీఆర్. అందుకే మొదటి నుండి టీడీపీకి ఆ వర్గం వెన్నుదన్నుగా నిలిచింది. అయితే 2004 నుండి టీడీపీలో బీసీ నాయకత్వం తగ్గుతూ వచ్చింది. 2014లో మళ్లీ ఆదరించారు. 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. అయితే ఇప్పుడు ఏపిలో రండు పార్టీలు ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాయి.
Jagan Strategy: గోదావరి జిల్లాలో బీసీ, కాపు వర్గాలకు పెద్ద గ్యాప్
ఈ నెల 15 నుండి వైసీపీ ప్రత్యేకంగా బీసీ సదస్సులు ఎందుకు నిర్వహిస్తుంది అనేది పరిశీలిస్తే..తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. కాపు సామాజికవర్గ ఓట్ల మీద ఫోకస్ పెడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ లక్ష్యం ఏమిటంటే ..? గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గానికి, బీసి సామాజిక వర్గానికి కొంత గ్యాప్ స్పష్టంగా కనబడుతుంది. కాపులు తమను బీసీల్లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. అదే జరిగినా, లేక కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు రిజర్వేషన్లు తగ్గిపోతాయి. రిజర్వేషన్లు 50శాతం లోపే ఉండేలన్న సుప్రీం కోర్టు తీర్పు మేరకు కాపులకు రిజర్వేషన్ లు కల్పిస్తే ఆ మేర బీసీలు నష్టపోతారు. అందుకే వారు కాపులను బీసిల్లో కలపడానికి, రిజర్వేషన్లు కల్పించడానికి వ్యతిరేకిస్తున్నారు.
2019లో వర్క్ అవుట్ అయిన జగన్ స్ట్రాటజీ
అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో బీసీలకు, కాపులకు మధ్య బాగా గ్యాప్ ఉంది. ఒక వేళ జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే కాపు సామాజికవర్గం టీడీపీ వైపు మొగ్గు చూపితే కఛ్చితంగా బీసీ సామాజికవర్గం ఆలోచన చేస్తుంది. గోదావరి జిల్లాల్లో యాంటీ కాపు ఓటింగ్ ను తమ వైపుకు తిప్పుకునే ఉద్దేశంతో బీసీల సదస్సులను నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహనరెడ్డి కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోనే కాపుల రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదు. దానికి తాను వ్యతిరేకం అని స్పష్టమైన ప్రకటన చేశారు. చాలా మంది జగన్మోహనరెడ్డి ఏమిటి అలా ప్రకటించారు అని అనుకున్నారు. కానీ అందులో జగన్మోహనరెడ్డికి పక్కా వ్యూహం ఉంది. తనకు వేయాల్సిన కాపు ఓటింగ్ ఎలానూ పడుతుంది. టీడీపీ అనుకూలంగా ఉండే బీసీ ఓటింగ్ ను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రత్యేక వ్యూహం, స్ట్రాటజీతో మాట్లాడారు. దీని వల్ల కాపులకు రిజర్వేషన్ వ్యతిరేకించి బీసీ వర్గాలు వైసీపీకి మద్దతు పలికారు.
బీసీ ఓటింగ్ కోసం రెండు పార్టీలు
ఇప్పుడు జనసేన తో టీడీపీ పొత్తు పెట్టుకుని పయనిస్తే బీసీలను కాపులకు, జనసేనకు, టీడీపీకి దూరం చేయాలన్నది వైసీపీ వ్యూహం. ఇదే క్రమంలో బీసీల ఓటింగ్ కాపాడుకునేందుకు కూడా టీడీపీ కూడా జనాల్లోకి వెళ్లాలని భావిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ వర్గాలకు ఆదరణ పథకం కింద రాయితీ పథకాలు ఇచ్చిన విషయాన్ని, మొదటి నుండి బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన అంశాలను జనాల్లోకి తీసుకుని వెళ్లేందుకు టీడీపీ సిద్దం అవుతోంది. సో..ఇప్పుడు రెండు పార్టీలు బీసీల పాట పాడుతున్నాయి. వైసీపీ 75 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టింది. 56 కార్పోరేషన్లు ఏర్పాటు, బీసీల సబ్ ప్లాన్ కు 31 కోట్లు ఖర్చు పెట్టడం, బీసీల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలను చైతన్య సదస్సులో వివరించేందుకు వైసీపీ సమాయత్తం అవుతోంది.