Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు గత నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా ఆయన డిహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతుండటంతో నిన్న రాజమండ్రి జీజీహెచ్ వైద్య నిపుణులు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు బరువు కూడా తగ్గారంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉందని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు.
భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం అని పేర్కొన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబు ని అనారోగ్య కారణాలతో అంతమొందించే ప్రణాళిక ఏదో రచిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందన్నారు. జ్యుడీషి యల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో పదే పదే పేర్కొనేందుకు పెట్టిన శ్రద్ధ ఆయన ఆరోగ్యం, భద్రతపై పెట్టడంలేదన్నారు. చంద్రబాబు ఏ హాని జరిగినా, సైకోజగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమని అయన చెప్పారు. చంద్రబాబు కోసం స్నేహ బ్యారక్ కేటాయించామన్నారు. ఆయన బయటకు వచ్చే సమయంలో ఏ ఖైదీ ఉండరని చెప్పారు. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. జైలులో పూర్తి వైద్య సహాయం అందుతోందన్నారు.
చంద్రబాబు జైల్ కు వచ్చిన సమయంలో 66 కేజీల బరువు ఉంటే ప్రస్తుతం బరువు 67 కేజీలు ఉన్నారన్నారు. అయిదు కేజీల బరువు తగ్గినట్లుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఒంటిపై దద్దుర్లు ఎక్కువగా ఉండటంతో జీజీహెచ్ వైద్య నిపుణులను సంప్రదించి జైల్ లో వైద్యం చేశామని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడూ వాడే మందులే వాడుతున్నారని అన్నారు. జైల్ కు వచ్చిన తర్వాత మందులు మారలేదన్నారు. జైలులో ఏసీ ఏర్పాటు చేసేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు.
హైప్రొఫైల్ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇస్తున్నామని తెలిపారు. జైలులో రెండు వేల మందికిపైగా ఖైదీలు ఉన్నారని, వాటర్ పొల్యూషన్ కారణమైతే అందరికీ రావాలి కదా అన్నారు. చంద్రబాబు ప్రతి మూమెంట్ సీసీ టీవీ లో రికార్డు అవుతుందన్నారు. తప్పుడు వార్తలు రావడంపై స్పష్టత ఇస్తున్నామని తెలిపారు. ఇకపై ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. భద్రతా లోపాలు ఉన్నాయన్న వార్తలు నమ్మొద్దని అన్నారు.