Eatela Rajendar: టీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి ఈటల రాజేందర్ విషయంలో ఏం జరగనుంది? జమున హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించినట్లుగా ఆరోపణల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇదే ఆరోపణలు…
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లోని మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ లో మంత్రి ఈటల అనుచరులు తమను బెదరించి భూములు లాక్కొన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని మంత్రి కబ్జాకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్గా స్పందించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్ను ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావుని అదేశించారు సీఎం… సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు
కేసీఆర్ ఆ పనే చేయనున్నారా?
తన సుదీర్ఘ కాల మిత్రుడు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత అయిన ఈటల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? అనే చర్చ వినిపిస్తోంది. ఆరోపణలపై విచారణ కోరడం, అంతే కాకుండా వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేయడం చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఈ తతంగాన్ని సీరియస్గానే తీసుకున్నారని స్పష్టం అవుతోంది. ఈ నివేదికల్లో ఆరోపణలు నిజం అవుతే చర్యలు సైతం అదే రీతిలో ఉంటాయని పలువురు అంటున్నారు.