Manchu Mohanbabu Vishnu: మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ పక్క మా సభ్యత్వాల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మరో పక్క అధ్యక్షుడుగా ఎన్నికైన మంచు విష్ణు. మంచు మోహన్ బాబులు షాకింగ్ కామెంట్స్ చేయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అవుతున్నాయి.
Read More: Huzurabad Bypoll: టీఆర్ఎస్ పప్పులు ఉడకలేదు..? ‘ఈటల’కు ఊరట..!!
Manchu Mohanbabu Vishnu: పోటీ నుండి చిరంజీవి డ్రాప్ అవ్వమన్నారు
మా ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం రాత్రి నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రకాశ్ రాజ్ సోమవారం తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మా ఎన్నికలపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ రాజీనామాలపై అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రకాష్ రాజ్, నాగబాబు ల రాజీనామాలను ఆమోదించబోనని తెలిపారు. తమ కుటుంబంలో ఒకరైన నాగబాబు..మనసుకు కష్టం వల్లనో లేక ఆవేశం వల్లనో తీసుకున్న నిర్ణయమని, త్వరలో వారిద్దరిని కలిసి ఈ విషయంపై చర్చించనున్నట్లు తెలిపారు. మా ఎన్నికల్లో తనను పోటీ నుండి తప్పుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికను ఏకగ్రీవం చేయాలని చిరంజీవి ఈ ప్రతిపాదన చేశారన్నారు. అయితే తన తండ్రి మోహన్ బాబు ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుపట్టడంతో పోటీలో నిల్చొని గెలిచానని విష్ణు స్పష్టం చేశారు. మూడు నెలల్లో మా అసోసియేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంచు విష్ణు చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తానని తెలిపారు.
నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదు
మరో పక్క మంచు మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల విజయం అందరిదన్నారు. తనను మొదటి నుండి రెచ్చగొట్టాలని చూశారని ఆరోపించారు. తానేమీ అసమర్ధుడిని కాదని, సింహం నాలుగు అడుగులు వెనకకు వేస్తే భయపడినట్లు కాదనీ, అది గురి చూసి పంజా విసురుతుందని అన్నారు. మనకు టైమ్ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలన్నారు. అన్ని నవ్వుతూనే స్వీకరించాలనీ, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మా ఎన్నికల గురించి మాట్లాడుకున్నారని అన్నారు. సమస్యలపై సీఎంలను కలిసి విజ్ఞప్తి చేస్తేనే వారు స్పందిస్తారని అన్నారు. సీఎం కేసిఆర్ ను మనం సన్మానించామా అని మోహన్ బాబు ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల సీఎంలను కలిసి విజ్ఞప్తి చేస్తే వాళ్లు సాయం చేస్తారని అన్నారు. రిపబ్లిక్ మువీ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ సీఎం జగన్ బంధువైన మోహన్ బాబు స్పందించి మాట్లాడవచ్చు కదా సూచించిన విషయం తెలిసిందే. ఆనాడు పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు స్పందిస్తూ ముందు మా ఎన్నికల్లో మంచు విష్ణు కు ఓట్లు వేసి గెలిపించండి, మా ఎన్నికల అనంతరం అన్నింటిపై మాట్లాడతానంటూ మోహన్ బాబు కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు మోహన్ బాబు చేసిన సంచలన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిందే అని అనుకుంటున్నారు.