విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని శివరామపురం గ్రామం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ గ్రామంలో దాదాపు 607 కుటుంబాలు, 3వేల మంది జనాభా ఉంది. అయితే ఈ గ్రామంలో బ్యాంకు ఖాతాలు ఉన్న అందరికీ డబ్బులు జమ కావడంతో ప్రస్తుతం ఈ గ్రామం చర్చనీయాంశంగా మారింది. అయితే తమ ఖాతాల్లోకి ఎవరు డబ్బు జమ చేశారన్న విషయం తెలియక కొందరు అయోమయంలో ఉన్నారు.మరికొందరు మాత్రం ఉన్నఫలంగా ఖాతాలో డబ్బులు జమ కావడంతో పండుగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు.
ఈ గ్రామంలో నివసిస్తున్న దాదాపు 200 మందికి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. డబ్బులు జమ అయ్యాయి అంటే కేవలం రెండు ,మూడు వేలు కాదు. ఏకంగా 13000, మరికొందరికి ఖాతాలో 16000 రూపాయల వరకు జమయ్యాయి. అయితే వీరి ఖాతాలో ఏ పథకం కింద డబ్బులు జమ అయ్యాయి? వీరి అకౌంట్లో ఎవరు డబ్బులు వేశారు? అనే విషయాలు ఏ ఒక్క అధికారికి అంతుచిక్కకుండా ఉన్నాయి. సాధారణంగా డబ్బులు వేయాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ ఉంటుంది. కాబట్టి పొరపాటుగా వేసే అవకాశం లేదు. పోనీ రైతు భరోసా వంటి పథకాల ద్వారా డబ్బులు పడ్డాయి అనుకోవడానికి ఇంటర్ చదివే విద్యార్థుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యాయి.
ఉన్నఫలంగా గ్రామ ప్రజలందరికీ ఖాతాలో డబ్బులు జమ కావడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఈ విషయం తమ దృష్టికి రాలేదనే విషయాన్ని అధికారులు తెలియజేశారు.అయితే ఆ ఊరి ప్రజలందరూ ఖాతాలో ఏవిధంగా డబ్బులు జమ అయ్యాయి అనే విషయం గురించి ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం శివరామపురం గ్రామ ప్రజలందరికీ ఖాతాలో డబ్బులు పడ్డాయన్న విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.