MP Raghurama: రాజద్రోహం తదితర నేరాభియోగాలతో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్ తో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్మీ ఆసుపత్రి నుండి నేరుగా ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లిన రఘురామ తన అరెస్టును సీరియస్ గా తీసుకుని కేంద్రంలోని పెద్దలను, ముఖ్య అధికారులను కలుస్తున్నారు. సుప్రీం కోర్టు బెయిల్ కండీషన్ ల ప్రకారం మీడియా ముందుకు అయితే రావడం లేదు కానీ.. తెరవెనుక చేయాల్సిన పనులను చక్కబెడుతున్నారు. ఏపి సీఐడికి చుక్కలు చూపించాలని డిసైడ్ అయినట్లు ఆయన చర్యలు కనబడుతున్నాయి. నిన్నరక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేడు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ పంత్ లను రఘురామ కలిశారు. దీంతో రేపు ఎవరిని కలుస్తారో అన్న చర్చ జరుగుతోంది.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను రఘురామ నిన్న కలిసి ఆర్మీ ఆసుపత్రిలో తనపై జరిగిన కుట్రను వివరించారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసిన వెంటనే గుంటూరు పోలీసులకు అప్పగించేందుకు ఆర్మీ ఆసుపత్రి రిజిస్టార్ గుంటూరు ఎస్పీ, ఓ వైసీపీ నేత చర్చలు జరిపారని ఫిర్యాదు చేశారు. ఏపి పోలీసులు కొంత మంది ఆర్మీ ఆసుపత్రి క్యాంటిన్ లో భోజనాలు చేసిన విషయానికి సంబంధించి సాక్షాలను రాజ్ నాధ్ సింగ్ కు అందజేశారు. రఘురామ ఫిర్యాదుపై విచారణ జరుపుతానని రాజ్ నాధ్ సింగ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
Read More: Fact Check: కానిస్టేబుల్ ను చితకబాదిన వీడియో వైరల్..! వాస్తవం ఏమిటంటే..?
తన ఫిర్యాదుల పరంపరలో భాగంగా నేడు ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ పిసి పంత్ ను కలిశారు. ఏపి సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. సీఐడీ విచారణలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని రఘురామ వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ పంత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందే ఏపి సీఐడీ రఘురామను అరెస్టు చేసిన తరువాత ఎన్ హెచ్ ఆర్ సీ కి రఘురామ తనయుడు భరత్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంతర్గత విచారణకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఏపి ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి నోటీసులు కూడా జారీ చేసింది. కాగా రఘురామ అరెస్టు తదుపరి పరిణామాలను వివరించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓంబిల్లా తదితర ముఖ్యుల అపాయింట్మెంట్ లను కూడా కోరినట్లు తెలుస్తోంది.