YSRCP: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార వైపీసీ ప్రణాళికలు రచిస్తొంది. ఈ క్రమంలో సర్వేల ఆధారంగా పలు నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారి అనుచరులు నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు, వైసీపీ ఇన్ చార్జి తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేశారు.
మంగళగిరిలో ఆళ్ల అనుచరులు పలువురు పార్టీ పదవులకు, పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ కీలక నిర్ణయంలో భాగంగా 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమించింది. పలువురు మంత్రులు, మాజీ మంత్రులకు స్థాన చలనం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జి గా మంత్రి విడతల రజిని, మంగళగిరికి గంజి చిరంజీవి, పత్తిపాడుకి బాలసాని కిషోర్ కుమార్, వేమూరుకు అశోక్ బాబు, సంతనూతలపాడుకు మేరుగ నాగార్జున, తాడికొండ కు మేకతోటి సుచరిత, కొండపికి మంత్రి ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేటకు రాజేష్ నాయుడు, అద్దంకికి పాణెం హనిమిరెడ్డి, రేపల్లెకు ఈవూరు గణేష్, గాజువాకకు వరికూటి రామచంద్రరావు లను పార్టీ నియమించింది.
ఈ విషయాన్ని సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఈ మార్పులు చేసినట్లుగా తెలిపారు. పార్టీ ఎవరినీ వదులుకోదనీ, అందరి సేవలనూ వినియోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పులతో 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నేతల గెలుపు అవకాశాన్ని బట్టి ఇన్ చార్జిలను మార్చామని ఆయన స్పష్టత ఇచ్చారు. అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించాలన్న లక్ష్యంతోనే జగన్ సర్కార్ అచచూతి అడుగులు వేస్తొందని చెప్పారు. గుంటూరు పశ్చిమకు మంత్రి విడతల రజినిని ఇన్ చార్జిగా నియమించడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ నుండి గెలిచి వైసీపీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది.
రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవి వెంకట రమణ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నప్పటికీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎక్కువగా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి లేదా తమ్ముడికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అత్యంత సన్నిహితుడైనప్పటికీ డాక్టర్ ఈవురు గణేష్ ను సమన్వయకర్తగా ప్రకటించారు. దీంతో మోపిదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గణేష్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ మోపిదేవి అనుచరులు అర్ధరాత్రి రేపల్లెలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. మోపిదేవికి మద్దతుగా పలువురు వైసీపీ కౌన్సిలర్లు రాజీనామాకు సిద్దమవుతున్నారు. రేపల్లె కొత్త ఇన్ చార్జి నియామకం పై అధిష్టానం పునరాలోచించలని డిమాండ్ చేస్తున్నారు. మంగళగిరిలో ఆళ్ల అనుచరులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేసిన రెండు మూడు నియోజకవర్గాలు మినహా ఇతర నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు, వారి అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.