AP Congress: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పీకే (ప్రశాంత్ కిషోర్) వ్యూహ రచనలతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో పీసీసీలుగా యువనేతలను ఎంపిక చేసింది. అదే విధంగా తెలంగాణలోనూ రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాత పార్టీ క్యాడర్ లో జోష్ వచ్చింది. కాగా ఏపిలోనూ రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ నాయకులు వైసీపీకి, కొందరు టీడీపీకి వెళ్లిపోవడంతో గడచిన రెండు ఎన్నికల్లోనూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం కూడా లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తరువాత నేతల వలసలతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా వైసీపీకి డైవర్ట్ అయ్యింది. దీంతో సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కూడా కాపాడుకోలేకపోయింది.
ప్రస్తుతం ఏపి పీసీసీ అధ్యక్షుడుగ సాకే శైలజానాధ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా పార్టీలో నిర్లిప్తత కొనసాగుతోంది. ఇంతకు ముందు పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన రఘువీరారెడ్డి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం సాకే శైలజానాధ్ వల్ల కాదన్న భావనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ మార్పునకు కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఇటీవల ఏపి దళిత నేతలు చింతా మోహన్, హర్షవర్థన్, జేడీ శీలం తో భేటీ అయి పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుంది అనే విషయాలపై అభిప్రాయాలను తీసుకున్నారు. నేడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజులతో వేరువేరుగా రాహుల్ గాంధీ బేటీ కానున్నట్లు సమాచారం. నేతల అభిప్రాయ సేకరణ అనంతరం త్వరలో కొత్త పీసీసీ బాస్ ను ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి.