ఏపీలో మరో సంచలనానికి శుక్రవారం ముహూర్తం ఫిక్సయింది. ఇప్పటి వరకు వైసీపీ అదినేత, సీఎం జగన్పై నిప్పులు చెరుగుతూ వచ్చిన ఆయన సోదరీమణులు వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీతలు.. ఇప్పుడు నేరుగా కదనరంగంలోకి దిగుతున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా వారు ప్రచారం చేయనున్నారు. కడప నుంచే ఇద్దరూ శుక్రవారం ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సునీత యాత్ర అంతా కడపలోనే సాగనుంది. ఇక, షర్మిల మాత్రం.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. అన్నను ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగనున్నారు.
అయితే.. షర్మిల పర్యటన కూడా తొలి వారం రోజులు కడపలోనే సాగనుంది. నిజానికి సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని అనుకుంటే.. కడపకు ఇన్ని రోజులు ఇచ్చేవారు కాదు. కానీ, అనూహ్యంగా ఆమె కడపలోనే 8 రోజులు కేటాయిస్తున్నా రంటే.. ఇక్కడ బలమైన వైసీపీ ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు.. కడపలోఎంపీ, రాజంపేటలో ఎంపీ అభ్యర్థులుగా ఉన్నవారిని ఓడించాలనే లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
నిజానికి అటు సునీత, ఇటు షర్మిలలు ఇప్పటికే వైసీపీకి సెగ పుట్టిస్తున్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. జగన్ను ఉతికి ఆరేస్తున్నారు. వివేకా హత్యను ప్రధాన వస్తువుగా తీసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవి ఎంతగా ఉన్నాయంటే.. ప్రధాన ప్రతిపక్షాలు.. టీడీపీ, జనసేనలు కూడా చేయనంతగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో జగన్ నేరుగా వారిని ఏమీ అనలేక.. అలాగని ఉండలేక సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో జగన్ ఇప్పటికేకడపలో పర్యటనలు పూర్తి చేసుకున్నారు.
మళ్లీ కడపకు వెళ్లే అవకాశం లేదు. కానీ, ఇప్పుడు షర్మిల, సునీతలు కడపలో ప్రచారం ప్రారంభిస్తున్నా రు. అంటే.. వారు లైవ్లో ఉండనున్నారు. పైగా ఎన్నికలకు మూడు వారాల ముందు వరకు షర్మిల కడపలోనే ఉండి.. సునీత పూర్తిగా అక్కడే తిష్ఠవేసి చేసే ప్రచారం ఎన్నికల వేళ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలకు పనిలేకుండా పోతుంద నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విపక్ష నాయకుల లక్ష్యం వైసీపీనే, ఇప్పుడు జగన్ సొంత సోదరీమణుల లక్ష్యం కూడా ఇదే. పొరుగువాళ్లు చెప్పేదానికంటే కూడా.. సొంత వారు చేసే విమర్శలకు బలం ఎక్కువ. సో. ఇక, విపక్షాలు.. ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చేసినట్టేనని అంటున్నారు. మరి ఈ వ్యతిరేకతను వైసీపీ ఎలా తట్టుకుని నిలుస్తుందో చూడాలి.