కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపీలో ముఖ్య నాయకులు చేజారుతున్నారు. ఇప్పటికే టికెట్లు రాని ఎస్సీ నాయకులు వరుస పెట్టి పార్టీ మారిపోయారు. అయితే.. వీరిలో ఒకరిద్దరు కీలక పార్టీలోకి వెళ్లగా.. మరిం త మంది కాంగ్రెస్ వైపు క్యూ కట్టారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు తాజాగా షర్మిల సమక్షం లో పార్టీ మారారు. ఇక, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా.. కొన్ని రోజుల కిందట ఇదే పనిచేశారు. ఇక, ఇప్పుడు మరో పేరు తెరమీదికి వచ్చింది.. అదే డొక్కా మాణిక్య వరప్రసాదరావు.
గతంలో మంత్రిగా చేసిన ఆయన.. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు ఈయన కూడా గుంటూరు రాజకీయాల్లో కాక పెట్టారు. అది కూడా వైసీపీలో కలకలం రేగే రేంజ్లో ఆయన రాజకీయాలను వేడెక్కించారు. ప్రస్తుత ఎన్నికల్లో డొక్కా.. తాడికొండ(ఎస్సీ) సీటును ఆశించారు. అయితే.. ఈ సీటు విష యంలో ముందు ఆశ పెట్టిన వైసీపీ.. తర్వాత మనసు మార్చుకుని.. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను రంగంలోకి దింపింది. అప్పట్లో డొక్కా పోరాటం చేశారు.
అయినా.. ఆయనకు టికెట్ రాలేదు. ఇక అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు. మేకతోటి సుచరితకు సహక రించాలన్న పార్టీ ఆదేశాలను కూడా డొక్కా పట్టించుకోవడంలేదు. పైగా తనకు ఆరోగ్యం బాగోలేదని చెబు తున్నారు. దీంతో పార్టీలో ఒక విధమైన గ్యాప్ అయితే వచ్చింది. ఇదిలావుంటే.. మరోవైపు కీలకమైన డొక్కాను తిరిగితన గూటికి చేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో డొక్కా కూడా.. ఎలానూ ప్రాధాన్యం లేని పార్టీలో ఉండడం ఎందుకులే అని అనుకుని.. ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.
అయితే.. ఈ విషయం తెలిసిన వైసీపీ అలెర్టయింది. సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబును రంగంలోకి దింపిన పార్టీ అధిష్టానం.. చర్చలకు తెరదీసింది. అయితే.. బలమైన హామీ దక్కలేదు. పార్టీలో ఉంటే.. మెరుగైన పదవిని ఇస్తామని చెబుతున్నా.. డొక్కాఆశిస్తున్న మంత్రి పదవిపై మాత్రం ఎలాంటి హామీ దక్కడం లేదు. అయితే.. ఇదే హామీ టీడీపీలో దక్కుతుందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. వైసీపీలో ఉండాలంటే మాత్రం మంత్రి పదవి హామీ కోసం పట్టుబడుతున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. ఏదేమైనా డొక్కా విషయంలో వైసీపీ సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఆయన సైకిల్ ఎక్కడం ఖాయమేనని అంటున్నారు పరిశీలకులు.