YSRCP: తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు వైసీపీలో చేరారు. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా స్వామిదాసు, ఆయన సతీమణి సుధారాణి పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని నిన్న సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన సందర్భంలో తిరువూరు టికెట్ నల్లగట్ల స్వామిదాసుకు ఇవ్వాలని కోరినట్లుగా తెలిసింది. అలానే మరో ఒకటి రెండు నియోజకవర్గాలు తాను సూచించిన నేతలకు ఇవ్వాలని కోరారు.
నాని వినతిపై సీఎం జగన్ కొంత మేర సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నల్లగట్ల స్వామిదాసు దంపతులు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాగా, స్వామిదాసు 1994, 1999 లో రెండు సార్లు తిరువురు ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలుపొందారు. వైసీపీ లో చేరిన అనంతరం స్వామిదాసు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన నివాసానికి వెళితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు.
YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!