Suicide: ఏపిలో ఇవేళ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. 72,26 శాతం విద్యార్ధినీ విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా బాలికలదే పైచేయి. అయితే పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధినీ విద్యార్ధులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా, ఫెయిల్ అయిన వారు బాధపడుతున్నారు. పలువురు విద్యార్ధినులు పరీక్షల్లో ఫెయిల్ అవ్వడాన్ని జీర్ణించుకోలేక మనస్థాపానికి గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే మనస్థానానికి గురైన ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లాలో ఇద్దరు విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం నవాబుకోటకు చెందిన విద్యార్ధిని పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో చీరతో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతితో గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పొతుదొడ్డిలో మరో విద్యార్ధిని కామేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. కామేశ్వరి పదో తరగతి పరీక్షల్లో గణితంలో ఫెయిల్ కాగా మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కామేశ్వరి ప్యాపిలి కస్తూరిబా విద్యాలయంలో చదువుకుంటోంది. ఈ విద్యార్ధిని మృతితో పొతుదొడ్డి గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.