AP Capital: ఏపి మూడు రాజధానుల అంశం హైకోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఏపి రాజధాని అమరావతిగా కేంద్ర హోంశాఖ మ్యాప్ లో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం లేఖలు అమరావతి అడ్రస్ తోనే కొంత కాలం వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల నుండి వచ్చే లేఖలు హైదరాబాద్ అడ్రస్ తో వస్తుండటం మరో వివాదానికి కారణం అయ్యింది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఏపి రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయడం, గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం కూడా అయిపోయింది.
Read More: Katti Mahesh: కత్తి మహేష్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ
అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతాంగం హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేయడంతో రాజధాని తరలింపు అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు (స్టే) ఇచ్చింది. రాజధానుల అంశంపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏపి రాజధానిగా కేంద్రం ఏ ప్రాంతాన్ని గుర్తిస్తుందనే అంశంపై వివాదం నడుస్తోంది. అమరావతిని కేంద్రం ఏపి రాజధానిగా గుర్తించలేదనే వాదన మొదలైంది. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్ టీ ఐ కార్యకర్త చైతన్యకుమార్ రెడ్డి ఇటీవల కేంద్రాన్ని ప్రశ్నించగా ఏపికి మూడు రాజధానులు అంటూ సమాధానం ఇచ్చింది. అయితే కేంద్రం ఇచ్చిన సమాధానంపై అమరావతి జేఏసీ అధ్యక్షుడు జీవిఆర్ శాస్త్రి హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో కేంద్రం మాట మార్చింది. ఆర్టీఐ కార్యకర్తకు మరో సమాధానం ఇచ్చింది. ఏపి రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందంటూ మరో లేఖను కేంద్ర హోంశాఖ పంపింది.
మరో పక్క అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతాంగం ఇక్కడే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు అవుతుందనీ, దీన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఏది ఎలా ఉన్నా అమరావతిని రాజధానిగా వైసీపీ ప్రభుత్వం అంగీకరించని కారణంగా హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ రాజధాని లేని రాష్ట్రంగా ఏపి కొనసాగనున్నది. రాజధాని వ్యవహారం ఇప్పట్లో తేలదని, ఒక వేళ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే అమరావతి ప్రాంత రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.