ఓ పక్క ఏపి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతుండగా, ఆ పార్టీ నేతలు వైసీపీ పాలన తీరును విమర్శిస్తున్నారు. మరో పక్క అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ప్రత్యేక సలహదారు ఏపిలో పర్యటన జరిపి రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల తీరును ప్రశంసించడం విశేషం. ఈ రెండు పరిణామాలు ఒకే రోజు జరగడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ 2014 తర్వాత వచ్చిన టిడిపి, వైసిపిప్రభుత్వాలు ప్రజల్ని తీవ్ర నిరాశకు గురిచేశాయన్నారు. అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేశాయని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటికీ తమ స్టిక్కర్లను వేసుకుంటున్నారని జీవీఎల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసిపి, టిడిపి పార్టీలు రెండు కూడా కుటుంబ పార్టీలేననీ, అవినీతి చేసిన పార్టీలేనని ఆరోపించారు. వీటికి ప్రత్యామ్నాయ వ్యవస్థగా బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైపల్యం చెందిందనీ, ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విసిగిపోయారనీ, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలతో సమానంగా గత ప్రభుత్వం టిడిపి కూడా వలగ బెట్టింది ఏమి లేదని అన్నారు. ఇలా బీజేపీ నాయకులు గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా మంగళవారం ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. సీఎంతో భేటీ అనంతరం మిశ్రా మాట్లాడుతూ ఏపిలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందుతున్న సేవలను పరిశీలించానన్నారు. చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్న గాంధీజీ చెప్పినట్లుగా ఏపిలో జరుగుతున్నాయన్నారు. వైద్యరంగంలోనూ చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారని కితాబు ఇచ్చారు. గ్రామ సచివాలయాలతో విప్లవాత్మక మార్పులు తెచ్చారనీ, అన్ని రాష్ట్రాలకు ఇవి ఆదర్శమని ప్రశంసించారు.
తాను మొదటి సారి ఏపికి వచ్చి వీటన్నింటినీ పరిశీలన చేశాననీ, టెక్నాలజీని అన్ని రంగాల్లో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ లతో వ్యవసాయం చేస్తున్న విధానం తనను ఆశ్చర్యపర్చిందన్నారు. కేవలం పది నిమిషాల్లో ఎకరం పొలం పురుగు మందుల పిచికారి చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. రైతు విత్తనం కొనుగోలు నుండి పంట విక్రయం వరకూ అంతా ఒకే చోట జరగడం బాగుంది అంటూ కొనియాడారు మిశ్రా. పలువురు కేంద్ర మంత్రులు ఏపికి వచ్చిన సమయంలో వివిధ పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో పక్క ఏపి బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇవి గమనిస్తున్న ప్రజలు మాత్రం బీజేపీ చేస్తున్నది రాజకీయంగా చేస్తున్న విమర్శలుగా భావిస్తున్నారు.
వివేకా హత్యపై తొలిసారిగా మీడియా ముందు స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!