Visakha: వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ విశాఖలో బీచ్ ఐటీ కారిడార్ అభివృద్ధి చేస్తున్న క్రమంలో దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రాలు వస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్ రైజ్ పేరుతో విశాఖలో ఐటీ అనుబంధ సంస్థ ఏర్పాటునకు ముందుకు వచ్చింది.
రుషికొండ ఐటీ హిల్స్ నందు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ తో హెల్త్ రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ ఫార్బ్ మెన్, ఏసీఎన్ ఇన్పోటెక్ ఎండీ చమన్ బైద్, ఏసిటా సీఈఓ కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ ఐటీ సలహాదారు శేషిరెడ్డితో భేటీ అయ్యారు. సంస్థ అందించే సేవలు, కల్పించే ఉద్యోగావకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హెల్త్ రైజ్ సంస్థ సీఈఓ డేవిడ్ మాట్లాడుతూ.. తమ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచేందుకు హెల్త్ కేర్ ఆర్గనేజేషన్స్ కు సహకారం అందిస్తుందని చెప్పారు.
రెవెన్యూ మేనేజ్ మెంట్, హెల్త్ కోడింగ్, వైద్య సంస్థలకు ఐటీ సర్వీసులు సైతం అందించేలా విశాఖ నుండి సంస్థ పని చేస్తుందని డేవిడ్ తెలిపారు. మంత్రి అమరనాథ్ మాట్లాడుతూ ఏపిటా, ఏసీఎన్ ఇన్ ఫోటెక్ అనే బీపీవో సంస్థ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ సంస్థ ఇక్కడ 5వేల మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు.
ఏపీని అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 ఇంజనీరింగ్ కళాశాలల ద్వారా ఏటా లక్షా 20వేల మంది వివిధ కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారని అన్నారు. అమెరికాలోని వివిధ టెక్ కంపెనీల్లో పని చేస్తున్న ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉంటాడని అమెరికా సంస్థ బృందానికి వివరించారు. స్టార్టప్స్ లో కూడా తెలుగు విద్యార్ధులు బాగా రాణిస్తున్నారని తెలియజేశారు.