Vijayawada politics: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలతో బెజవాడ రాజకీయం వేడెక్కింది. ఒక సీటు చుట్టూ.. ఒక వ్యక్తి చుట్టూ..రెండు పార్టీలు ఎవరి గేమ్స్ వారు వేసుకుంటున్నారు. విజయవాడ రాజకీయాల్లో కొన్ని నెలల్లోనే అనూహ్యమైన మార్పులు చూసే పరిస్థితి ఏర్పడుతోంది. అటు ఇటు పార్టీల మార్పులు ఉంటాయి. నియోజకవర్గాల మార్పులు ఉంటాయి. అభ్యర్ధుల మార్పులు, ఇన్చార్జిల మార్పులు కూడా రెండు పార్టీల్లోనూ స్పష్టంగా గమనించే అవకాశం ఉందని ఇటీవల జరిగిన పరిణాలను చూస్తే తెలుస్తోంది. వంగవీటి రాధా మొన్న చేసిన కామెంట్స్ కు గల కారణం ఏమిటి ? ఆయన పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం ఏది ? ఆయనకు బలం ఉన్న నియోజకవర్గం ఏది ? అసలు దేవినేని, వంగవీటి కుటుంబాలు విజయవాడ తూర్పులో తలబడితే ఏమవుతుంది. విజయవాడలో ఉన్న ముగ్గురు టీడీపీ నేతల్లో ఎవరైనా గన్నవరం వెళతారా ? వెళ్లే అవకాశం ఉందా ? వైసీపీలో ఎటువంటి మార్పులు, టీడీపీలో ఎటువంటి మార్పులు ఉంటాయనేది విశ్లేషించుకుంటే..
Vijayawada politics: విజయవాడ సెంట్రల్ అడుగుతున్న వంగవీటి రాధ..?
విజయవాడలో మొత్తం మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పు ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన నేత గద్దే రామ్మోహన్ ఉన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యేగా వైసీపీ నేత మల్లాది విష్ణు ఉన్నారు. పశ్చిమ ఎమ్మెల్యేగా వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఒకటి టీడీపీ, రెండు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు మీద కేవలం 25 ఓట్లతో టీడీపీ నేత బొండా ఉమా ఓడిపోయారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నుండి జలీల్ ఖాన్ కుమార్తె పోటీ చేసి ఓడిపోయారు. వంగవీటి రాధా, బుద్దా వెంకన్న, బొండా ఉమా, గద్దె రామ్మోహన్, జలీల్ ఖాన్ కుటుంబం, నాగుల్ మీరా, కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత..ఈ ఏడుగురు టీడీపీ నుండి విజయవాడ నుండి టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో రాధాకు, బొండా ఉమాకు విజయవాడ సెంట్రల్ కావాలి. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, జలీల్ ఖాన్, కేశినేని శ్వేతకు పశ్చిమ నియోజకవర్గ సీటే కావాలి. వంగవీటి రాధాకు విజయవాడ తూర్పు ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గద్దే రామ్మోహన్ ను గన్నవరం పంపడానికి పార్టీ ప్రతిపాదిస్తోంది. కానీ విజయవాడ తూర్పు నుండి 2004లో వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన తూర్పు వద్దు సెంట్రల్ కావాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే 2008లో జరిగిన పునర్విభజనలో భాగంగా విజయవాడ తూర్పులో వంగవీటి కుటుంబానికి అనుకూలమైన కొన్ని డివిజన్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కలిశాయి. తమ కుటుంబానికి బలమైన పట్టు ఉన్న సెంట్రల్ నియోజకవర్గం అయితే తాను గెలుస్తాను అని రాదా ఈ నియోజకవర్గం కావాలని పట్టుబడుతున్నారు.
బొండా ఉమాకు ప్రెస్టేజీగా విజయవాడ సెంట్రల్
ఇక్కడ బోండా ఉమా ఒక సారి ఎమ్మెల్యేగా పని చేశారు. రెండవ సారి కేవలం 25 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు కాబట్టి ఆయన తన రాజకీయ సామ్రాజ్యాన్ని ఈ నియోజకవర్గంలో నిర్మించుకున్నారు. విజయవాడ సెంట్రల్ వంగవీటి రాధాకు ఇవ్వడం కష్టసాధ్యమే. ఇస్తే బొండా ఉమా పార్టీలోనే ఉండే పరిస్థితి లేదు. అంత ప్రేస్టేజీగా బొండా ఉమా తీసుకుంటారు. దీంతో సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధాకు ఇవ్వడం కుదరదు. రాధాకు తూర్పు మాత్రమే ఇస్తారు. ఆయన తూర్పు వద్దు అంటారు. ఇలా వంగవీటి పరిస్థితి ఉంది. ఇక పశ్చిమకు వచ్చే సరికి ఇక్కడ కాపు కంటే ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ. ఆ తరువాత కాపు, ఆర్యవైశ్య ఓటింగ్ ఎక్కువ. ఇక్కడ మంత్రి వెల్లంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మీద పోటీ చేయడానికి నాగుల్ మీరా, జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న, కేశినేని శ్వేత ఆశిస్తున్నారు. మరో వైపు జనసేనతో పొత్తు ఉంటే ఈ సీటును పోతిన మహేష్ కు ఇచ్చే అవకాశాలు ఉందని టాక్. విజయవాడలో ఈ పరిస్థితులను సెట్ చేయడం టీడీపీలో చాలా కష్టం. నియోజకవర్గాల పునర్విభజన తరువాత రెండు సార్లు తూర్పులో ఓడిపోయినందున రాధా అక్కడి నుండి 2019లో సీటు ఇస్తానన్నా పోటీ చేయలేదు. అందుకే స్థానికంగా ఉన్న రాజకీయాల కారణంగా ఈ విధంగా మాట్లాడారని అనుకుంటున్నారు.
విజయవాడ వైసీపీ ఎంపి అభ్యర్ధిగా వల్లభనేని వంశీ లేదా దేవినేని అవినాష్..?
వైసీపీలో కూడా అంతా క్లీయర్ గా లేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గ సీటు దేవినేని అవినాష్ కు ఇస్తామన్నది కమిట్మెంట్. విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు ఉన్నారు. పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అయితే విజయవాడ ఎంపీ సీటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సరైన అభ్యర్ధి ఏవరూ లేరు. పీవీపీ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తరువాత ఆయన మళ్లీ యాక్టివ్ అవ్వలేదు. ఈ తరుణంలో విజయవాడ ఎంపీ సీటును దేవినేని అవినాష్ లేదా వల్లభనేని వంశీలలో ఒకరికి ఇవ్వాలన్నది పార్టీ లో ఒక ప్రతిపాదన వినబడుతోంది. వంశీ ఎంపిగా పోటీ చేస్తే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండు పార్టీల్లో డిఫరెంట్ పాలిటిక్స్ అమలు అవుతున్నాయి. ఏ పార్టీ ఎవరికి సీట్లు ఖరారు చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పే ఛాన్స్ లేదు. అయితే రాబోయే ఎన్నికల నాటికి విజయవాడలో అనేక మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.