పైన అమ్మవారు… కింద కమ్మవారు… అంటూ దువ్వాడ జగన్నాధం సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ విజయవాడ వాసులకు సరిగ్గా సరిపోతుంది. విజయవాడలో కమ్మ సామాజికవర్గం అధికం అనేది అందరి భావన. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ఆర్యవైశ్య, మార్వాడీ, మైనారిటీలే అధికం. వీరికి తోడు కనిగిరి ప్రాంతానికి చెందిన సెటిలర్స్ కూడా ఇక్కడే నివసిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు ఇక్కడ నుంచి మైనారిటీ లేదా వైశ్య అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఎన్డీఏ కూటమి తరఫున తొలిసారిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
వాస్తవానికి తొలి నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై పోతిన మహేశ్ గంపెడాశ పెట్టుకున్నారు. జనసేన పార్టీ తరఫున తనే అభ్యర్థి అంటూ అందరికీ చెప్పుకున్నారు కూడా. అటు మీడియా కూడా మహేశ్ అభ్యర్థి అంటూ ప్రచారం కూడా చేశాయి. అయితే చివరి నిమిషంలో మహేశ్ను కాదని… బీజేపీ తరఫున సుజనా చౌదరి బరిలోకి దిగారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. ఇది కూటమి అభ్యర్థికి కాస్త ఇబ్బంది కలిగించే అంశమే.
వైసీపీ తరఫున షేక్ ఆసిఫ్ పేరును జగన్ ప్రకటించారు. తొలినుంచి మైనారిటీ నియోజకవర్గంగా పేరున్న పశ్చిమ నుంచి 2014లో జలీల్ ఖాన్ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన వెల్లంపల్లి శ్రీనివాస్.. ఆ తర్వాత వైసీపీలో చేరడంతో.. 2019లో ఆయన గెలిచారు. చిన బొంబాయిగా గుర్తింపు తెచ్చుకున్న కాళేశ్వరరావు మార్కెట్ పరిధిలో ఆర్యవైశ్యలతో పాటు మార్వాడీలు అధికం. ఇక వస్త్రలత నిండా హోల్ సేల్ వ్యాపారులే. వీరే ఎన్నికల్లో కీలకం అనేది బహిరంగ రహస్యం. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు అనేది ప్రధాన ఆరోపణ. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వెల్లంపల్లి పర్యటనకు వెళ్లిన సమయంలో… ఓ యువకుడు నిలదీశాడు కూడా.
పైగా రూ.1500 కోట్లు అవినీతి చేశావు నువ్వు అంటూ ఆరోపించారు కూడా. ఆ ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ కూడా అయ్యాయి. వీటన్నిటికి తోడు దుర్గ గుడిలో వెండి రధంపై వెండి సింహాలు చోరీ, ఆలయంలో అక్రమాలు, ప్రసాదం తయారీలో అవకతవకలు, సరిగ్గా దసరా నవరాత్రుల సమయంలోనే కొండ రాళ్లు పడిపోవడం… భవానీ ఐలాండ్లో వైసీపీ నేతల పెత్తనం… టీడీపీ నేతలతో పాటు సామాన్యులపై కూడా వైసీపీ నేతల దాడులు, భవానీపురంలో భూకబ్జాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దారుణాలున్నాయి. అందుకే పశ్చిమ నుంచి వెల్లంపల్లిని తప్పించారంటున్నారు స్థానికులు.
అయితే పంజా, భవానీపురం ప్రాంతాల్లో మైనారిటీలు అధికారం. అందుకే ఆ వర్గానికి చెందిన ఆసిఫ్ను అభ్యర్థిగా ప్రకటించారని తెలుస్తోంది. విద్యా సంస్థలున్న ఆసిఫ్ ఆర్థికంగా బలమైన నేత కూడా.
అయితే బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సుజనా చౌదరి ఆర్థికంగా చాలా బలమైన నేతగా గుర్తింపు. ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపున్న సుజనా డబ్బులు ఖర్చు చేయడంలో వెనుకాడరనే మాట వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే.. మంత్రివర్గంలో సుజనా చౌదరికి స్థానం ఖాయం అనేది బహిరంగ రహస్యం. కమ్మ సామాజిక వర్గం ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ… సుజనా సౌమ్యుడనే పేరుంది.
జాతీయ స్థాయిలో పరిచయాలున్న నేత. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. ఇవన్నీ సుజనాకు కలిసి వచ్చే అంశాలు. ఈసారి ఓటుకు రూ.2 వేలు పైనే ఇస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే జనసేన నేత పోతిన మహేశ్ వైసీపీలో చేరటం కూటమికి కొంత ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అలాగే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా కూటమి అభ్యర్థికి సహకరించాల్సి ఉంది. కానీ అది కూడా అనుమానమే. ఇవి కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ప్రతికూల అంశాలు