విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్నది సెంట్రల్ నియోజకవర్గం. బ్రాహ్మణ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఇలాంటి చోట ఇప్పుడు వైసీపీ తరఫున మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా… టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తలపడతున్నాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో మాత్రమే బోండా ఉమా ఓడారు. ఇది రాష్ట్రంలోనే అత్యల్ప మెజారిటీ. అయితే ఆ తర్వాత నుంటి సెంట్రల్ పరిధిలో బోండా నిత్యం తిరుగుతూనే ఉన్నారు.
అదే సమయంలో అందరికీ అందుబాటులో ఉంటాడనే గుర్తింపు కూడా. వీటన్నిటికి తోడు మాస్ లీడర్ అనే పేరు కూడా బోండా ఉమా సొంతం. ప్రధానంగా అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, నున్న, సత్యనారాయణ పురం రైల్వే కాలనీ, మధురానగర్ ప్రాంతాల్లో బోండా ఉమాకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే గత ఎన్నికల్లో జగన్ హవాలో కూడా కేవలం 12 ఓట్ల తేడాతోనే బోండా ఉమా ఓడారు. ఆ తర్వాత ఉమాకు పార్టీ పోలిట్బ్యూరో పదవి ఇచ్చారు చంద్రబాబు. వీటన్నిటికి తోడు కాపు నేత అనేది మరో బలం. పైగా మాచర్లలో పరామర్శకు వెళ్లిన సమయంలో బోండా ఉమపై దాడి జరిగింది. ఆ దాడిలో ఉమ గాయపడ్డాడు కూడా. ఆ సానుభూతి ఇప్పటికీ కొనసాగుతుంది.
ఇక వైసీపీ విషయానికి వస్తే… నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కాదని పశ్చిమ నియోజకవర్గం ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను ఇక్కడ నుంచి పోటీ చేయిస్తున్నారు. వెల్లంపల్లి పేరు ప్రకటించగానే మల్లాది విష్ణు వర్గం అగ్గిమీద గుగ్గిలంలా మారింది. ఒకదశలో మల్లాది పార్టీ మారుతారని… ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని కూడా పుకార్లు షికారు చేశాయి. సత్యనారాయణపురం ప్రాంతంలో బ్రాహ్మణ ఓటు బ్యాంక్ అధికం. అందుకే గతంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన కోట శ్రీనివాసరావు ఇక్కడ నుంచే బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు కూడా.
ఇప్పుడు ఆ వర్గం మొత్తం వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇందుకు ప్రధానం కారణం… 175 నియోజకవర్గాల్లో కేవలం కోన రఘుపతికి మినహా మరెవరికి జగన్ టికెట్ కేటాయించలేదు. ఈ సమయంలోనే సింగ్ నగర్లో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్పై రాయితో దాడి జరిగింది. ఆ దాడిలో కన్నుకు గాయమైందని వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కట్టు వేశారు. అయితే ఈ దాడి టీడీపీ నేతలు చేశారని ముందుగా ప్రచారం చేసినప్పటికీ… తర్వాత క్వార్టర్ బాటిల్, డబ్బులు ఇస్తామని తీసుకువచ్చారని… అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో… యువకులు రాళ్లు వేసినట్లు తెలుస్తోంది.
దీంతో సానుభూతి రాకపోగా వైసీపీకి చెడ్డపేరు కూడా వచ్చేసింది. ఇది వైసీపీ ఓటమికి పరోక్షంగా కారణం కూడా. వీటన్నిటికి తోడు… కాపు నేత వంగవీటి రాధాకృష్ణ కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన నేత. ఆయన వర్గం కూడా టీడీపీకి అండగా నిలిచింది. అందుకే ఈసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలుపు నల్లేరు మీద నడక అంటున్నారు.