ycp government: ఏపిలోని వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుకూలమా? వ్యతిరేకమా? అంటే ఎవరూ కరెక్ట్ సమాధానం చెప్పలేని పరిస్థితి. సీఎం జగన్మోహనరెడ్డి కేంద్రంతో పేచీ పెట్టుకోవాలన్న ఆలోచనలో అయితే లేరు. రాజ్యసభలో తమ ఎంపీల మద్దతును అవసరమైన సందర్భాలలో అందిస్తూనే ఉన్నారు. సఖ్యతగా ఉంటున్నా కేంద్రం రాష్ట్రానికి పెద్దగా సహకరిస్తున్న దాఖలాలు కనబడటం లేదు. కొన్ని విషయాలు చూస్తే అనుకూలమే అని పిస్తుంది. మూడు రాజధానుల అంశం విషయంలో తమకు ఏమి సంబందం లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమే నంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. మరో పక్క విభజన హామీలను నెరవేర్చడం లేదు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ బకాయిలు విడుదల చేయడం లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల ధరఖాస్తును కేంద్రం పక్కన పెట్టింది.
రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ ను స్వీకర్ ఓం బిర్లాకు అందజేసి దాదాపు 11 నెలలు గడిచినా దానిపై చర్యలు తీసుకోలేదు. పిటిషన్ ను తిరస్కరించనూలేదు. మరో పక్క తాజాగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరితే వెంటనే ఆమోదం తెలియజేస్తూ మూడు నెలల ఎక్స్టెన్షన్ ఇచ్చింది కేంద్రం, అంతకు ముందు కూడా నీలం సాహ్నికి రెండు పర్యాయాలు ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. అదే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అక్కడి సీఎస్ కు ఎక్స్టెన్షన్ ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే వెనక్కు తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఏపిలోని వైసీపీని కేంద్రంలోని బీజేపీ మిత్రపక్షంగా చూస్తున్నట్లే అనుకోవాలి. మరో పక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఇటు ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడితే కేంద్రం సామరస్యపూర్వక చర్యలు చేపట్టలేదు.
ఇక శాసనమండలి రద్దు బిల్లు, దిశ చట్టం బిల్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపితే వాటిపై నెలలు గడుస్తున్నా దస్త్రాలు కేంద్రం వద్దనే పెండింగ్ లో ఉన్నాయి. టీటీడీకు సంబంధించి లక్షలాది రూపాయల రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు గత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలు మార్లు విజ్ఞప్తులు ఇచ్చినా వాటిపైనా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలా అనేక అంశాలలో ఏపికి కేంద్రం కొన్ని విషయాల్లో అనుకూలంగా, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా వ్యవహరిస్తున్నది. దీంతో కేంద్రంలోని బీజేపీ.. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా? అనేది పూర్తి క్లారిటీతో చెప్పలేని పరిస్థితి.