జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నిన్న రాత్రి కాకినాడ సభలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను గెలవనివ్వను అన్న పవన్ కళ్యాణ్ దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేసి నెగ్గాలని సవాల్ విసిరారు. తాను ఓటమి పాలైతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని తెలిపారు. పవన్ కూడా ఈ సవాల్ స్వీకరించాలన్నారు.
పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ పార్టీ ప్రారంభించిన సమయంలో ఆయన వెంట ఉన్నవాళ్లు ఎవరైనా ఇప్పుడు ఉన్నారా అని ప్రశ్నించారు. తాను 30 సంవత్సరాలుగా ఉన్నాననీ, అప్పటి నుండి ఇప్పటి వరకూ తన వాళ్లు తనతోనే ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ తనపై చేసిన అసత్య ఆరోపణలు నిరూపించాలన్నారు. తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు సార్లు గెలిచాననన్నారు. తాను రౌడీని, గుండాను అయితే ప్రజలు ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు ద్వారంపూడి. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడనీ, ఆయనకు తనను విమర్శించే స్థాయి లేదని ద్వారంపూడి అన్నారు. జనసేనను ఎవరిని ఉద్దరించడానికి పెట్టాడని ప్రశ్నించారు.
చంద్రబాబుతో బేరం కుదరకనే వారాహితో రోడ్డుపైకి వచ్చాడని ద్వారంపూడి అన్నారు. రాజకీయాల్లో పవన్ సీఎం కావడం సాధ్యం కాదని, కావాలంటే సినిమాల్లోనే సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. తాను తల్చుకుంటే కాకినాడలో పవన్ బ్యానెర్ లే ఉండేవి కావన్నారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ద్వారంపూడి హెచ్చరించారు. ఎవడో చెప్పిన మాటలు విని కోతిలా గంతులు వేయకు అంటూ హితవు పలికారు. కాకినాడలో అన్ని సామాజికవర్గాలు కలిసి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారనీ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ ను తరిమేస్తే అసలు కులాల గొడవే ఉండదని అన్నారు.
2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కానున్నాయని తెలిపారు. పవన్ మాటల్లో చూపిస్తే తాను చేతల్లో చూపించగలను అని అన్నారు. సీఎం కాలేనని మూడు నెలల కిందట పవన్ అన్నాడనీ, ఇప్పుడు సీఎం చేయండని అని అడుగుతున్నాడని వీటిని బట్టే ఆయనలో నిలకడ లేమి అర్ధం అవుతోందన్నారు. కాకినాడ పోర్టులో తక్కువ చార్జీలు ఉండటం వల్లనే బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయనీ, వాస్తవాలు తెలుసుకుని పవన్ విమర్శలు చేయాలని ద్వారంపూడి హితవు పలికారు.