YSRCP MP Vijayasai Reddy: ఎన్నికల సంఘం గుర్తింపు లేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వొద్దని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. జనసేన గుర్తింపు లేని పార్టీ.. గుర్తింపు లేని పార్టీ జనసేనను ఎలా సమావేశానికి ఆహ్వానించారు అంటూ ఈసీని ప్రశ్నించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. విజయసాయి నేతృత్వంలోని వైసీపీ నేతల బృందం ఇవేళ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ, జనసేనపై ఫిర్యాదు చేశారు.
అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆరు అంసాలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారనీ, ఇలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరారు. తెలంగాణ ఓటర్ లిస్ట్ లో డిలీట్ చేశాకనే ఏపీలో ఓటరుగా నమోదు చేయాలన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను, ఏపీలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలను ఒకే ఫేజ్ లో నిర్వహించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఓకే రోజు రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చని అన్నారు.
కోనేరు సురేష్ అనే వ్యక్తి పది లక్షల పైచిలుకు బోగస్ ఓట్లు అని సీఇఓకు ఫిర్యాదు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒక వ్యక్తికి అన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బోగస్ ఓట్ల గురించి బీఎల్ఓలు చెప్పాలి కానీ ఒక వ్యక్తి ఎలా చెబుతారని, ఆ ఫిర్యాదే బోగస్ అని ఆ ఫిర్యాదుదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ ఓట్లు అనేవి లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారని అన్నారు.
టీడీపీ వారు ఉద్దేశపూర్వకంగా వైసీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నారా లోకేష్, చంద్రబాబు సభల్లో అసభ్యపదజాలంతో సీఎం జగన్ ను విమర్శించారని, లోకేష్ ఎర్రబుక్ పేరుతో అధికారులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు.
Chandrababu Pawan Kalyan: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు అందజేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్