AP Assembly: అసెంబ్లీ అంటే చట్టాలు తయారు చేసేది.. బిల్లులు ఆమోదించేది.. రాష్ట్ర సమస్యలు చర్చించేది.. నియోజకవర్గాల సమస్యలను ఆయా ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది అని థియరీలో చదువుకుంటాం.. నిజం కూడా అదే.. కానీ రాజకీయాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, ఎమ్మెల్యేలుగా ఎవరెవరో వస్తున్నారు.., మరి అసెంబ్లీ ఎందుకు మారకూడదు..!? అందుకే అసెంబ్లీ కూడా మారిపోయింది. మారడం అంటే అడ్రెస్స్ మారడమో.., రంగులు మారడమో కాదు.. అసెంబ్లీ నడిచే తీరు మారిపోయింది. సోది, సొల్లు, పురాణాలు, భజనలు వేదికగా మారింది. చివరి నాలుగు ప్రభుత్వాలు హయాంలో అంటే 2004 నుండి AP Assembly నడిచిన తీరు ఓ సారి చెప్పుకుందాం..!
AP Assembly: వైఎస్ హయాంలో లోతుగా…
2004 నుండి 2009 వరకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చలు చాలా జరిగేవి. లోతుగా ఉండేది. ఏ బిల్లుపై అయినా, సమస్యపై అయినా గంటల తరబడి మాట్లాడేవారు. అధికార – ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగేది. చంద్రబాబు – వైఎస్ ఇద్దరూ హవా ప్రదర్శించేవారు. ఈ మాటల యుద్ధంలో ఎప్పుడూ వైఎస్ పైచేయి సాధించేవారు. ఎవ్వరూ ఎక్కడ శృతిమించలేదు. కానీ ఓ సందర్భంలో మాత్రం వైఎస్.. తన ప్రత్యర్థి చంద్రబాబుని ఉద్దేశించి కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు. “నిన్ను కడిగేస్తా ఈరోజు.. మీ అమ్మ కడుపు నుండి ఎందుకు బయటకు వచ్చావా అనుకునేలా చేస్తాను” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి రెండు రోజులు దుమారం రేపాయి. కానీ చర్చ ఎప్పుడూ పక్కదారి పట్టేది కాదు. అర్ధవంతంగా ముగిసేది..!
* తర్వాత 2009 నుండి 2014 వరకు.. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సిఎంలుగా ఉన్నప్పుడు కూడా చర్చలు అర్ధవంతంగా సాగేవి. కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా భజనలో ఉంటూ మంత్రులు, సీఎం కూడా నిత్యం ఆమెను స్తుతించే వారు. కానీ ఏ సమస్య మీద చర్చిస్తున్నారో దానికి ఒక ముగింపు ఇచ్చేవారు. వ్యక్తిగత దూషణలు లేవు. అరుపులు, కేకలు, దూషణలు లేవు. రెండు సందర్భాల్లో మాత్రం తోపులాట జరిగింది. 2012 లో ఓ సారి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి మీదకు టీడీపీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెళ్లారు. మార్షల్స్ అడ్డుకున్నారు.
2014 నుండీ కొత్త సంస్కృతి..!
2014 లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్షంగా వైసీపీ వచ్చింది. వైసీపీలో చాలా మంది కొత్త వాళ్ళు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. రోజా, అనిల్ కుమార్ యాదవ్, కోటం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి దూకుడైన వాళ్ళు తొలిసారిగా అసెంబ్లీలోకి వచ్చారు. ఇటు టీడీపీలో కూడా ప్రభుత్వ పక్షాన ఉండడం కొత్తవాళ్లు ఉండడంతో రెండు పక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు బీభత్సంగా జరిగేవి. 90 శాతం ఏ చర్చ సానుకూలంగా ముగియలేదు. నిత్యం దూషణలు, పెనుగులాటలు, తోసుకోవడాలుతో ముగిసేవి. ఓ సందర్భంలో పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఉద్దేశించి “ఏంట్రా.. ఏంట్రా అరేయ్.. పాతేస్తా” అన్నారు. మరో సందర్భంలో రోజా దారుణమైన హావభావాలు పలికించి ఎమ్మెల్యే అంటే అసెంబ్లీలో ఇలా కూడా ఉంటారా..!? అనేలా చేశారు. అలా 2014 నుండి 2019 సెషన్స్ వైసిపికి తిట్లు, వైసీపీ దూకుడు, టీడీపీ చంద్రన్న భజనతో ముగిసాయి. చివరి ఏడాదిన్నర వైసీపీ సభకు వెళ్ళలేదు..
2019 తర్వాత.. మరీ దారుణం..!!
ఇక 2019 లో జగన్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ అంటేనే అర్ధం మారిపోయింది. చర్చలు అవసరం లేదు. “మాటకి ముందు జగన్ ని పొగడాలి. మాటల చివర జగన్ ని పొగడాలి. మధ్యలో చంద్రబాబుని తిట్టాలి”.. చాలు ఈ మాత్రం చేస్తే ఆ రోజు సభ ముగిసినట్టే. దీనిలో ఆ ఎమ్మెల్యేలు కూడా పోటీ పడుతున్నారు. సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తారనో.. ఆయన దృష్టిలో పడాలనో.. అవసరం లేకపోయినా కల్పించుకుని మరీ అసందర్భంగా కూడా ప్రతిపక్షాన్ని తిడుతుంటారు. జగన్ ని భజన చేస్తుంటారు. ఈ రెండేళ్లలో రెండు పక్షాలు కలిసి అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చ ఒక్కటీ చేయలేదు.. అంతా ఏకపక్షమే..!!